వినూత్న సెల్పీకి ప్రయత్నించి ప్రాణాలమీదికి తెచ్చుకున్న యువకుడు
విజయవాడ జగ్గయ్య పేట శివారులో దారుణం
వినూత్నమైన సెల్పీకోసం ప్రయత్నించి ఓ యువకుడు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. రైలు పట్టాలపై నిలబడిన గూడ్స్ రైలు పైకెక్కి సెల్పీ దిగాలన్న అతడి కోరికే ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు పైకెక్కి మొబైల్ ఫోన్ లో సెల్పీ తీసుకుంటుండగా అతడి చేయి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో షాక్ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివారులో ఓ గూడ్స్ రైలు సిగ్నల్ కోసం ఆగివుంది.దీంతో దానిపై ఎక్కి ఫోటో దిగాలని సాయి అనే యువకుడు బావించాడు. అందుకోసం ట్రైన్ ఎక్కిన సాయి సెల్ ఫోన్ లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడి చేయి ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో సాయి తీవ్రంగా గాయపడ్డాడు.
దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటినా అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఇంకా అతడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం.