అనంతపురానికి శుభవార్త: కియా ఉద్యోగాలు 90 శాతం జిల్లాకే
13 వేల కోట్ల పెట్టుబడితో వస్తున్న కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చే 11 వేల ఉద్యోగాలలో 90శాతం స్థానిక యువకులకే ప్రాధాన్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కియా మోటార్స్ కార్ల పరిశ్రమతో కరవు జిల్లా అనంతపురము రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆటోమోటివ్ రంగంలో అతి పెద్ద సంస్థగా వున్నా కియా మోటార్స్ ఆంధ్రాకు రావడం,అందునా అనంతపురం జిల్లా ఈ యూనిట్ స్థాపనకు ఎంపిక కావడం ఒక చరిత్రాత్మక అంశం అని ఆయన అన్నారు.
13 వేల కోట్ల పెట్టుబడితో వస్తున్న కియా కార్ల ఫ్యాక్టరీలో 11 వేల ఉద్యోగలుంటాయని అందుంలో 90శాతం స్థానిక యువకులకు అందివ్వడం జరుగుతుందని ఆయనచెప్పారు.
కియా కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం పెద్దఎత్తున వచ్చిన పెనుకొండ టిడిపి సభ్యులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని అభినందించడానికి వచ్చారు. వారి ని ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్పారు.
ఎమ్మెల్యే బీకే పార్థసారధి నేతృత్వంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కియా కంపెనీ కోసం పెనుగొండను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును పూలమాలతో సత్కరించారు.
అనంతపురము జిల్లాకు నీటి సౌకర్యం కల్పిస్తే ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తాయని ,దీనికోసమే తాను హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయడానికి చూస్తున్నానని ఆయన చెప్పారు.సమీపంలో బెంగళూరు నగరం వుండటమే అనంతపురము జిల్లాకు వరమని ముఖ్యమంత్రి అన్నారు.