సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు : నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు.. ఆనవాళ్లు ఇవే

By Siva KodatiFirst Published Sep 14, 2021, 7:47 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు. రాజు గురించిన వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు పోలీసులు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు వుంటుందని.. ఎత్తు సుమారు 5.9 అడుగులు వుంటుందని అంజనీ కుమార్ చెప్పారు. పెద్ద జుట్టుకు రబ్బరు బ్యాండ్ వేసుకుని తిరుగుతారని సీపీ స్పష్టం చేశారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అనే టాటూ వుంటుందని అంజనీ కుమార్ స్పష్టం చేశారు. 

Also Read:సైదాబాద్ బాలికపై రేప్, హత్య: హైదరాబాద్ సీపీ ఉన్నత స్థాయి సమీక్ష.. నిందితుడి కోసం 100 మంది పోలీసులు

అంతకుముందు సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. ఈ భేటీకి క్రైమ్స్ అదనపు సీపీ, ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు హాజరయ్యారు. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకునేందుకు మరో 10 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

కాగా, సైదాబాదులోని సింగరేణి కాలనీలో పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన మిత్రుడితో రాజు కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. దాని ఆధారంగా రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

click me!