మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ ;వరుస ఎన్ కౌంటర్ లలో 40 మంది హతం

First Published Apr 24, 2018, 5:21 PM IST
Highlights

ఇంద్రావతి నదీ తీరంలో భారీగా మృతదేహాలు లభ్యం

గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బలు తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా పోలీసుల ఎన్ కౌంటర్ లలో మొత్తం 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దులో గత నాలుగురోజులుగా ఈ మారణ హోమం కొనసాగుతోంది. 

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో గత శనివారం నుండి ఈ మావోయిస్టుల వేట మొదలైంది. పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు ఏటవల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ తారసపడ్డారు. దీంతో వారు తేరుకునే చాన్స్ ఇవ్వకుండా సీఆర్పీఎఫ్‌, కోబ్రా బలగాలు సంయుక్తంగా కాల్పులకు దిగారు.  ఈ కాల్పుల్లో 16 మంది చనిపోగా, మరి కొంత మంది మావోలు గాయాలతో తప్పించుకున్నారు. అయితే ఇవాళ ఉదయం ఇంద్రావతి నదీ తీరంలో మరో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించాయి.

అనంతరం తప్పించుకున్న మావోల కోసం ఆదివారం చత్తీస్ ఘడ్ సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. అయితే ఇక్కడ మరోసారి బలగాలకు, మావోలకు మద్య కాల్పులు జరిగాయి. ఇందులో మరో నలుగురు చనిపోయారు. ఇక సోమవారం మరో నలుగురు మావోయిస్టులు పోలీసుల తూటాలకు బలయ్యారు. 

ఇలా మూడు సార్లు జరిగిని ఎన్ కౌంటర్ లలో మొత్తం 40 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనల్లో నక్సల్స్‌ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు, ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

click me!