banana
గజిబిజీ జీవితంలో చాలా మంది ఒక్క భోజనం తినడంలో మాత్రం సమయపాలన పాటించరు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయో మనలో చాలా మందికి తెలుసు.. అయినా ఆ అలవాటును మాత్రం మానుకోనివారున్నారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అసిడిటీతో సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసిడిటీ ప్రధాన లక్షణం కడుపు తిమ్మిరి. కొంతమంది గుండెల్లో మంట, కడుపు నొప్పి కూడా ఉంటుంది.
ఎసిడిటీని నివారించడానికి ఉదయాన్నే అరటిపండ్లు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. కాగా చాలా మంది అరటిపండ్లను ఉదయాన్నే తినడానికి వెనకాడుతుంటారు. నిజానికి అరటిపండ్లు అసిడిటీ ఉన్నవారు ధైర్యంగా తినగలిగే ఆహారమని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే దాని నుంచి యాసిడ్ రిఫ్లక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎసిడిటీని నివారించడానికి అరటిపండ్లు ఎంతగానో సహాయపడతాయి.
అంతేకాదు అరటిపండ్లు మలబద్దకాన్ని నివారించడానికి కూడా గొప్పగా సహాయపడతాయి. ఉదయం పరగడుపున గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని తాగిన తర్వాత అరటిపండ్లను తినాలి. అరటిపండ్లకు బదులుగా నల్ల ఎండుద్రాక్ష లేదా బాదం పప్పులను కూడా తినొచ్చని రుజుతా దివేకర్ చెబుతున్నారు.
మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ సి, విటమిన్ బి 6 తో సహా ఎన్నో ఇతర ముఖ్యమైన ఖనిజాలు, ఫోలేట్ మొదలైనవి అరటిపండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి.
అరటి పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఈ పండ్లు స్థూలకాయాన్ని, అధిక బరువునున నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
రోజుకు ఒక అరటిపండును తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. అరటిపండ్లలో పెక్టిన్ అనే నీటిలో కరిగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి అరటిపండ్లు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.