సూపర్ స్టార్ కృష్ణ మరణం చిత్ర పరిశ్రమలో తీరని లోటుగా మారింది. ఈ నెల 15న కృష్ణ అనారోగ్యం కారణంగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీనితో కృష్ణ ఫ్యామిలీతో పాటు, చిత్ర పరిశ్రమ, అభిమానులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
కాగా నేడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులంతా కృష్ణ గారి పెద్ద కర్మ నిర్వహించారు. హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం మహేష్ బాబు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 5వేల మంది అభిమానులు హాజరయ్యేలా పాస్ ల పంపిణీ జరిగింది.
వివిధ రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణ గారి సంస్కరణ సభలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహేష్ ఫ్యామిలీ.. సుధీర్ బాబు, ఆది శేషగిరి రావు, ఇతర కుటుంబ సభ్యులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
mahesh babu
ఈ కారక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. నాన్నగారు నాకు ఎన్నో ఇచ్చారు. మీ అభిమానాన్ని కూడా ఇచ్చారు. అదే నాకు ఎంతో విలువైనది. నాన్నగారు నా గుండెల్లో, మీ గుండెల్లో ఎప్పటికి నిలిచే ఉంటారు. ఆయన మన మధ్యే ఉంటారు అంటూ మహేష్ కృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక హీరో సుధీర్ బాబు మామగారిని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. ఎన్ని జన్మలు ఎత్తినా సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లుడిగానే పుట్టాలని కోరుకుంటున్నా అంటూ సుధీర్ బాబు బోరున ఏడ్చేశాడు.
Krishna
ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని కూడా హాజరయ్యారు. కృష్ణ గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. టాలీవుడ్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు సూపర్ స్టార్ కృష్ణ కారణం అయ్యారు. సాహసాలకు పెట్టింది పేరు ఆయన. బుర్రిపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కృష్ణ టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు. కృష్ణ దాదాపు 340 పైగా చిత్రాల్లో నటించారు.