ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్లేఆఫ్స్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకున్నాయి. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ఫైనల్కి చేరగా, ఇప్పుడు అందరి దృష్టి ఎలిమినేటర్ మ్యాచ్పై పడింది.
మరికాసేపట్లో (శుక్రవారం) ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక పోరాటం జరగనుంది. ఈ మ్యాచ్ ఓడిన జట్టుకు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించనుంది. కాగా గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ను ఎదుర్కొంటుంది.అయితే ఈ మ్యాచ్లో ప్రముఖంగా ఆరుగురు ప్లేయర్స్పై అందరి దృష్టి పడింది.
శుభ్మన్ గిల్ (GT) vs దీపక్ చాహర్ (MI)
గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అతను ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్న ఆటగాళ్లలో ఒకడు. మరోవైపు, ముంబై బౌలర్ దీపక్ చాహర్, గిల్ను గతంలో నాలుగు సార్లు ఔట్ చేశాడు. అయితే, గిల్ చాహర్ బౌలింగ్కు 72 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి మధ్య పవర్ప్లేలో జరిగే పోరు మ్యాచ్ ప్రారంభానికి టోన్ సెట్ చేస్తుంది. ఒకవైపు గిల్ విజృంభించాలని చూస్తుంటే, చాహర్ వికెట్ తీసి ముంబైకి మంచి ఆరంభం అందించాలని యత్నిస్తాడు.
సూర్యకుమార్ యాదవ్ (MI) vs రషీద్ ఖాన్ (GT)
ముంబై మిడిల్ ఆర్డర్లో కీలకంగా నిలుస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఈ సీజన్లో మంచి పరుగులు చేశాడు. అతను గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్తో తలపడనుండగా, ఇది ఆసక్తికర పోరుగా మారనుంది. రషీద్ ఇప్పటివరకు సూర్యను ఔట్ చేయలేదు. సూర్యకుమార్ ఖాన్ బౌలింగ్కు 77 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు మ్యాచ్ దిశను మార్చే అవకాశముంది.
రోహిత్ శర్మ (MI) vs మహ్మద్ సిరాజ్ (GT)
ఓపెనర్ రోహిత్ శర్మ పవర్ప్లేలో దూకుడుగా ఆడే శైలి తెలిసినదే. అతనిని ఎదుర్కొనబోయే గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉన్న ఆటగాడు. గత రికార్డులో రోహిత్, సిరాజ్ బౌలింగ్పై 140.98 స్ట్రైక్ రేట్తో 86 పరుగులు చేశాడు. కానీ ఈ సీజన్ చివరి మ్యాచ్లో సిరాజ్ అతన్ని ఔట్ చేయడమే కాకుండా, 30 డాట్ బాల్స్ వేసి ఒత్తిడి పెంచాడు. ఈ పోరులో విజేత ఎవరో ముంబై ఇన్నింగ్స్కు దిశ చూపుతుంది.
దీంతో ఈ ఆరుగురు ఆటగాళ్ల మధ్య పోరాటం ఆసక్తిగా మారనుంది. వీరితో పాటు రెండు జట్టలోని ఇతర ప్లేయర్స్పై కూడా అందరి చూపు ఉంది. మరి ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలవనున్నారు. క్వాలిఫయర్ 2లోకి అడుగుపెట్టేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.