Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఏం చెప్పినా ఆ ఉత్తరాంధ్ర బఫూన్లు నమ్మేస్తారు: మాజీ విప్ రవికుమార్

ఆంధ్రా బిత్తిరిసత్తి అయిన బొత్స, ఢమాబుస్సుల సీతారామ్‌ , ఎప్పుడేం మాట్లాడతాడో తెలియని అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్‌ వంటివారు ఏవేవో చెప్తూ ఉత్తరాంధ్రవాసుల్ని మోసం చేస్తున్నారన్నారని మాజీ విప్, టిడిపి నాయకులు కూన రవికుమార్ ఆరోపించారు.  

tdp leader  kuna ravi kumar fires on ys jagan
Author
Visakhapatnam, First Published Dec 24, 2019, 9:57 PM IST

శ్రీకాకుళం: నేరస్తుడు పరిపాలకుడిగా ఉంటే రాష్ట్రం ఎలా విఛ్చిన్నమవుతుందో చెప్పడానికి  నవ్యాంధ్రప్రదేశే పెద్ద ఉదాహరణని టిడిపి నాయకులు, మాజీవిప్‌ కూన రవికుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి వెన్నెముకలాంటి రాజధానిని మూడు ముక్కలు చేస్తానని చెప్పి ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా పనిచేయడమే  లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంగళవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో రవికుమార్ విలేకరులతో మాట్లాడారు. గుమాస్తాకు ఎక్కువ, అధికారికి తక్కువైన ఒక అసమర్థ అధికారి జీఎన్‌ రావు ఇచ్చిన నివేదికను డిగ్రీ కూడా పూర్తిచేయని ముఖ్యమంత్రి ఆధారంగా, ప్రామాణికంగా తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ఏనాడో తెన్నేటి విశ్వనాథం హయాంలోనే అభివృద్ధికి బాటలుపడిన విశాఖ ఉదంతాన్ని మర్చిపోయి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఆర్థిక రాజధాని అయిన విశాఖను మరింతగా వృద్ధి చేయాలనే సదుద్దేశంతో 70వేలకోట్ల పెట్టుబడులతో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఆదానీ డేటాసెంటర్‌ను, లులూగ్రూప్‌ని వెనక్కుపంపిన జగన్‌ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం ఉత్తరాంధ్రవాసుల్ని మోసం చేయడమేనన్నారు. ముఖ్యమంత్రి ఏం చెప్పినా   ఉత్తరాంధ్రలో ఉండే బఫూన్లు కొందరు ఆయనకు మద్ధతుగా మాట్లాడుతున్నారని  రవికుమార్‌ మండిపడ్డారు. 

ఆంధ్రా బిత్తిరిసత్తి అయిన బొత్స, ఢమాబుస్సుల సీతారామ్‌ , ఎప్పుడేం మాట్లాడతాడో తెలియని అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్‌, వంటివారు ఏవేవో చెప్తూ ఉత్తరాంధ్రవాసుల్ని మోసం చేస్తున్నారన్నారు. ఢమాబుస్సుల సీతారామ్‌గా పిలువబడే స్పీకర్‌ తమ్మినేని తనసొంత గ్రామానికి రోడ్డుకూడా వేయించలేదని, అలాంటి వ్యక్తి ఉత్తరాంధ్ర అభివృద్ధి అనడం హాస్యాస్పదమన్నారు. 

read more  విశాఖ నుండి అమరావతికే... జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉత్తరాంధ్ర అంటే ఒక్క విశాఖ నగరమే కాదనే విషయాన్ని ధర్మాన కృష్ణదాస్‌, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని   తెలుసుకోవాలన్నారు. వారికి ఉత్తరాంధ్రపై అంతప్రేముంటే ప్రభుత్వ కార్యాలయాలను  శ్రీకాకుళంలో ఏర్పాటుచేసేలా జగన్‌పై ఒత్తిడితేవాలన్నారు. 27నజరిగే కేబినెట్‌లో  శ్రీకాకుళం అభివృద్ధిపై చర్చ జరిగేలా ముఖ్యమంత్రిని ఒప్పించాలని రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. 

గతంలో రాజధాని అమరావతిలో ఉండాలన్న జగన్‌ ఇప్పుడెందుకు మాటమార్చాడన్నారు. శ్రీకాకుళంలో ప్రభుత్వ భవనాలు, అసెంబ్లీ లాంటివి నిర్మించేలా స్పీకర్‌ చొరవతీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీచేయకుండా తప్పుకుంటానని కూన తేల్చిచెప్పారు. సీతారామ్‌, ఇతర ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు సిగ్గు, పౌరుషం, దమ్ము, దైర్యముంటే సచివాలయ భవనాలు శ్రీకాకుళానికి వచ్చేలా చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. 

గతంలో తండ్రి అధికారంతో విశాఖలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడి అక్కడ భూములు పోగేసిన జగన్‌ వాటిని కాపాడుకోవడానికే వైజాగ్‌ని రాజధానంటూ ప్రకటన చేశాడన్నారు. గత ఐదేళ్లలో విశాఖ పరిసర ప్రాంతాల్లో 11వేల ఎకరాలు రిజిస్ట్రేషన్‌ అయితే జగన్‌ వచ్చాక ఏడునెలల్లోనే సుమారు 15 నుంచి 20వేల ఎకరాల భూమార్పిడులు జరిగాయన్నారు. 

వైవీ.సుబ్బారెడ్డి రూ.2వేల కోట్లు కాజేసే ఉడాభూముల్ని నొక్కేయడానికి రంగం సిద్ధం చేసుకుంటే విశాఖ నడిబొడ్డున ఉన్న టైకూన్‌ రెస్టారెంట్‌ పక్కనున్న 3.50ఎకరాలను విజయసాయి కొట్టేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడన్నారు. వాల్తేర్‌ క్లబ్‌ లీజ్‌ని రద్దుచేసి తక్షణమే దాన్ని తమకు అమ్మాలని జగన్‌, విజయసాయి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. 

read more  జగన్ సీఎం అయ్యాడని ఆనందించా... కానీ: మాజీ మంత్రి పితాని

విజయసాయి వియ్యంకుడు, అరబిందో ఫార్మా తరుపున కొన్నివేల ఎకరాలు కొనుగోలు చేశాడన్నారు. తండ్రి అధికారంతో ఆనాడు వేల ఎకరాలు కాజేసి ఇప్పుడు మరిన్ని భూముల ఆక్రమణకు తెరలేపిన జగన్ తనపార్టీ వారితో నిజమైన ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు తెరలేపాడన్నారు. విశాఖవాసులు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని జగన్ భూఆక్రమణలను తిప్పికొట్టాలని కూన పిలుపునిచ్చారు.    

అన్‌రాక్‌ పేరుతో వైఎస్‌ అల్లుడు అనిల్‌కుమార్‌కు 1650 ఎకరాలు, రస్‌అల్‌ఖైమా కంపెనీ పేరుతో బాక్సైట్‌ తవ్వకాలకోసమంటూ పెన్నా ప్రతాపరెడ్డికి 10వేల ఎకరాలు, బీచ్‌శాండ్‌ పేరుతో వైఎస్‌.సుధాకర్‌రెడ్డికి 20,592ఎకరాలు సముద్రతీరాన్ని  వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టడం నిజంకాదా అని కూన ప్రశ్నించారు. బీచ్‌శాండ్‌ పేరుతో శ్రీకాకుళంలో వైఎస్‌ వివేకానందరెడ్డికి 3594 ఎకరాలు కేటాయించారన్నారు. 

తండ్రి పాలనలో జరిగిన భూకేటాయింపులను రద్దుచేసి వాటిని తన ప్రభుత్వ స్వాధీనం చేసుకునే దమ్ము, ధైర్యం జగన్‌కు ఉన్నాయా అని టీడీపీ నేత డిమాండ్‌ చేశారు. మాజీ సైనికాధికారులకు చెందిన మరో 170 ఎకరాలను కూడా కాజేశారన్నారు. ఉత్తరాంధ్ర  సముద్రప్రాంతాన్ని లూఠీచేయడానికే జగన్‌ ప్రభుత్వం తాపత్రయపడుతోందన్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios