గుడిలో పూజలు చేస్తున్న పూజారి పవన్ ను మహిళలు బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. పవన్ పూజారిపై మహిళలు చితకబాదిన ఘటన విజయవాడలోని భవానీపురంలో చోటు చేసుకుంది. 

విజయవాడ: పూజలు చేస్తున్న పూజారిని బయటకు లాక్కొచ్చి మహిళలు మూకుమ్మడిగా దాడిచేసిన ఘటన విజయవాడలోని భవానీపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హెచ్‌బీ కాలనీకి చెందిన కోట పవన్ సాయిత్రిశక్తి నిలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శనివారం ఉదయం మరో ఇద్దరు పూజారులతో కలిసి పవన్ పూజలు చేస్తుండగా, విశ్రాంత ఉద్యోగి ఆనం మోహన్‌రెడ్డి భార్య చెంచులక్ష్మి, కుమార్తె పూర్ణిమారెడ్డి, మరికొందరు మహిళలు అక్కడకు వచ్చారు. పూజలు చేస్తున్న పవన్‌ను బయటకు ఈడ్చుకువచ్చి మూకుమ్మడిగా దాడిచేశారు. వారు దాడిచేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

 పవన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మోహన్‌రెడ్డిపై పవన్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఈ దాడి వెనక ఉన్న అసలు కారణంగా తెలుస్తోంది. 

మరోవైపు, పూర్ణిమారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రిని పరామర్శించేందుకు వెళ్తుండగా తనను అడ్డుకుని పవన్, మరికొందరు దౌర్జన్యం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.