గాంధీ సిద్దాంతాలను పాటిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెసేనని శైలజానాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో గాంధీ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.     

విజయవాడ: బిజెపి ,ఆర్ఎస్‌ఎస్ అవలంబిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టడానికే ముజ్ మే హై గాంధీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ కార్యదర్శి శైలజనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సమావేశంలో యువతలో గాంధి వాదాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఒకవైపు గాడ్సేను కీర్తిస్తూ ,మరో వైపు గాంధీ గురించి మాట్లాడుతున్నారు. భాజపా ద్వంద్వ వైఖరిని విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలని ఎన్ఎస్‌యూఐ తీర్మానించింది. 

బిజెపి విధానాలతో లక్షలాది చిన్న తరహా వ్యాపారాలు మూత పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పార్టీ కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే రాజకీయాలు చేస్తోందని అన్నారు.

రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తే కనీసం సమాధానాలు చెప్పే ధైర్యం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. స్టేట్ బ్యాంక్ వంటి పెద్ద పెద్ద బ్యాంకులు అప్పు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాయని....దీంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు.ప్రజలు, తాము చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు కావాలని ప్రత్యారోపణలు కాదన్నారు. 

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఇంచార్జ్ అనులేఖ మాట్లాడుతూ... ఈ నెల 25వ తేదీ నుండి రాష్ట్రంలో ముజ్ మీ హై గాంధీ కార్యక్రమాన్ని నెల్లూరు నుండి ప్రాతంభిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు.

ఫీజు రియంబర్సుమెంట్, స్కాలర్ షిప్స్, విద్యార్థి సమస్యలపై నిరసనలు చేపడతామన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా అంశాలపై పోరాటాన్ని ఉదృతం చేస్తామన్నారు.