ఉద్యమంలో ఎస్సీలదే కీలకపాత్ర.. ఏడేళ్లలో అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ దండవేయలేదు: షర్మిల
కేసీఆర్ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరని.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు.. కానీ, చివరకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదని షర్మిల ఎద్దేవా చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తారా? లేదా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది ఎస్సీలేనన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన దళితభేరి సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 400 మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది వారేనని.. వైఎస్ఆర్ హయాంలో ముగ్గురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు.
ఎస్సీ ఐఏఎస్లను కేసీఆర్ అవమానించారని.. ఆయన చేసిన అవమానాలతో ఐఏఎస్లు ముందే రిటైర్ అయ్యారని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరని.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు.. కానీ, చివరకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదని షర్మిల ఎద్దేవా చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తారా? లేదా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రతి రోజూ దళితులపై దాడులు జరుగుతున్నాయని.. కేసీఆర్ పాలనలో ఎస్సీలపై దాడులు 800 శాతం పెరిగాయన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితులకు రూ.10 లక్షలు ఇస్తున్నారని.. ఏడేళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయలేదని షర్మిల దుయ్యబట్టారు. అడ్డగూడూరు పీఎస్లో ఎస్సీ మహిళను లాకప్డెత్ చేస్తే చర్యలేవని.. దళితుల కోసం కేటాయిస్తున్న డబ్బులు ఎవరి చేతుల్లోకి పోతున్నాయి అని ఆమె ప్రశ్నించారు.