పిరికి పందల్లారా... ఎదురుగా వచ్చి పోరాడలేక, వైఎస్ విగ్రహం కూలుస్తారా : షర్మిల
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చివేత ఘటనపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా వచ్చి పోరాడే దమ్ములేక వైఎస్ విగ్రహాన్ని కూలుస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూల్చివేత వ్యవహారం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసిన పిరికిపందల్లారా ఖబడ్దార్ అంటూ ఆమె హెచ్చరించారు. ప్రజల్లో ముఖం చెల్లక.. జనం చీదరించుకుంటున్నారన్న అసహనంతో వైఎస్ విగ్రహాలను కూల్చుతున్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైఎస్సార్టీపీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని ఆమె మండిపడ్డారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన జనం గుండెల్లో కొలువైన వైఎస్ స్థానాన్ని ఎవరూ కూల్చలేరని షర్మిల దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో వైఎస్ విగ్రహాన్ని కూల్చేసిన వెధవలను తక్షణం అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా... వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఐ డైరెక్టర్తో ఆమె భేటీ అయ్యారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ షర్మిల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం వుంది.