తెలంగాణలో పందికొక్కుల్లా తిన్నది చాల్లేదా.... ఇక దేశంపై పడుతున్నారా: కేసీఆర్పై షర్మిల వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వాఖ్యలు చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తెలంగాణలో పందికొక్కుల్లా తిన్నది చాల్లేదని.. దేశంపై పడుతున్నారా అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వాఖ్యలు చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల . వీఆర్ఏలు 70 రోజులుగా కొట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఅర్ హామీ ఇచ్చారని... దీని గురించి కేసీఆర్ను అడగబోతే వారి పేపర్ను మొహం మీద కొట్టారట అంటూ షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రికి అధికార మదం ఉందని ఆమె మండిపడ్డారు. వీఆర్ఏలు పేపర్ ఇస్తే మొహం మీద కొడతారా అంటూ షర్మిల ఫైరయ్యారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా...తెలంగాణ కోసం కొట్లాడలేదా అని ఆమె నిలదీశారు.
మీకు అధికారం ఇచ్చింది ఈ ప్రజలేనని.. సమ్మె చేస్తూ ఎంతో మంది వీఆర్ఏలు చనిపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసీఆర్కి చావు మూడిందని, పోయేకాలం వచ్చిందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దరిద్రం ఇక్కడితో చాలదు అన్నట్లు...దేశాలు ఏలబోతాడట అంటూ షర్మిల చురకలు వేశారు. ఇక్కడ చేసిందేమి లేదు కానీ ఇక దేశం మీద పడతాడట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంది కొక్కుల్లాగా ఇక్కడ తిన్నది చాలదని, ఇక దేశం మీద పడ్డారంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వందల కోట్లు పెట్టి జెట్ విమానాలు, హెలికాప్టర్లు కొంటామని చెబుతున్నారని.. ఇదంతా ప్రజల డబ్బేనని ఆమె అన్నారు.
ALso REad:తెలంగాణా అడిగితే సిగరెట్టా, బీడీనా అన్నారు.. ఇప్పుడేమో వారి పిల్లలే : షర్మిలపై హరీశ్రావు వ్యాఖ్యలు
అంత డబ్బు టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చిందని షర్మిల ప్రశ్నించారు. అన్నం ఉడికిందా అని ఒక్క మెతుకు చూస్తే చాలని... కేసీఅర్ అవినీతి తెలుసుకోవాలంటే ఒక్క కాళేశ్వరం చూస్తే చాలని ఆమె ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు మింగేశారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ఎడమ కాలి కింద తెలంగాణ ఆత్మ గౌరవం నలుగుతోందని... ఆయనను ఫామ్ హౌజ్కే పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయని షర్మిల జోస్యం చెప్పారు.
అంతకుముందు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై మండిపడ్డారు టీఆర్ఎస్ నేత , మంత్రి హరీశ్ రావు. ఆనాడు తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టు, బీడీనా అన్నారని ఆయన గుర్తుచేశారు. ఇవాళ వారి పిల్లలు వచ్చి తెలంగాణలో తిరుగుతున్నారంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఆయన షర్మిలకు హితవు పలికారు. మీరు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారంటే అంతకంటే దరిద్రం వుండదంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.