‘విచ్చలవిడి తవ్వకాలతో ప్రాణాలు తీస్తున్రు..’ షెట్లూర్ లో బాధిత కుటుంబానికి వైయస్ షర్మిల పరామర్శ
క్వారీ నిర్వాహకులు నిబంధనల ప్రకారం మంజీరా నదిలో మూడు మీటర్ల లోపు ఇసుక తొవ్వాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా 10 మీటర్ల వరకు తొవ్వుతున్నారని వైయస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్టారీతిన గుంతలు తీయడం వల్లనే వాటిలో నీళ్లు నిండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party)అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గం (Jukkal constituency)బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో పర్యటించారు. మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు (అంజవ్వ, జ్యోతి, గంగోత్రి, ప్రశాంత్) మృతి(death)చెందగా.. బాధిత కుటుంబాన్ని, బంధువులను పరామర్శించారు. మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించారు.
దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం... నదిలో మునిగి ఐదుగురు మృతి
ఈ సందర్భంగా వైయస్ షర్మిలతో గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.. క్వారీ నిర్వాహకులు నిబంధనల ప్రకారం మంజీరా నదిలో మూడు మీటర్ల లోపు ఇసుక తొవ్వాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా 10 మీటర్ల వరకు తొవ్వుతున్నారని వైయస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్టారీతిన గుంతలు తీయడం వల్లనే వాటిలో నీళ్లు నిండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు అతి వేగంగా నడపడంతో గ్రామానికి చెందిన ఓ యువకుడి కాలు కూడా విరిగిందని తెలిపారు.
ఆ తరువాత వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తూ కోట్లు దండుకుంటున్నారు. నిబంధనలను విరుద్ధంగా వాగులు, నదులను తోడేస్తున్నారు. ప్రమాదవశాత్తు గుంతల్లో పడి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబంలో నలుగురు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదు. వీరి మృతికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంజీరా నదిని అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారు." అని మండిపడ్డారు.
కాగా, జూన్ లో కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లేందుకు ఓ కుటుంబం నది దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నీటిలో మునిగి ఐదుగురు మృతిచెందారు. మృతులంతా బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
కొద్ది రోజుల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు జరపడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా ఇలాంటి పెద్ద గుంతలో పడి మునిగిపోయారు. కాపాడేవారు లేక నీటమనిగి ఐదుగురు మరణించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబానికి చెందినవారు మరణించడంతో రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి మొత్తం నలుగురు చనిపోయారు.