YS Sharmila: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సిట్ విచారణపై వైఎస్సార్టీపీ నేత వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

YS Sharmila: టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. సిట్‌‌ దర్యాప్తు చివరి దశకు చేరడంతో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ)విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితులు, టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్‌‌, సెక్రటరీ సహా కమిషన్‌‌ కస్టోడియన్స్‌‌ను ప్రశ్నించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. కమిషన్ అడ్మిన్‌‌ అసిస్టెంట్‌‌ సెక్రటరీ సత్యనారాయణ, సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని బుధ, గురు వారాల్లో విచారించనున్నది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ వారికి నోటీసులు జారీ చేశారు.

ఇదిలాఉంటే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరంలో సిట్ విచారణపై వైఎస్సార్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల విమర్శల వర్షం కుప్పించారు. ఆమె ట్వీట్ చేస్తూ..‘‘ TSPSCలో లీక్ అయినవి 15 పేపర్లు, రద్దు అయినవి 6 పరీక్షలు, రోడ్డున పడ్డది 10లక్షల మంది నిరుద్యోగులు. ‘కీలక నిందితులు’ అని తేల్చింది ఇద్దరిని మాత్రమే. ఇదీ చిన్న దొర ఆధ్వర్యంలో నడిచిన సిట్ రిపోర్టు ’’
అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో డ్రగ్స్ కేసు,ఎమ్మెల్యేల కొనుగోలు కేసులాగే TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణాన్ని సిట్ నీరుగార్చే ప్రయత్నం చేస్తోందనీ ఆరోపించారు. ఒక్క పేపర్ లీక్ అయితే బయటికి పొక్కే విషయం, 15 పేపర్లు లీక్ అయ్యేదాకా బయటకు రాలేదంటే ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదంటారా? సర్వర్ నుంచి పేపర్స్ లీక్ అయ్యాయంటే ముఖ్యమైన మంత్రి KTR ప్రమేయం లేదంటారా? అని ప్రశ్నించారు. ఇంత జరిగినా బోర్డును ప్రక్షాళన చేయలేదంటే.. ఇంకా కొలువులు అమ్ముకునే ఉద్దేశం మీకుందా? మీరు నిర్దోషులైతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నట్లు? నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారా? అంటూ వైఎస్ షర్మిల నిలాదీశారు.

కొలువులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సిగ్గురాని ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల గోస పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసమే T-SAVE ఏర్పడిందని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే దాకా పార్టీలకు అతీతంగా T-SAVE పోరాడుతుందని దీమా ఇచ్చారు. ఇందులో నిరుద్యోగులు, విద్యార్థులు సైతం భాగస్వాములై ఈ నెల 17న ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి, ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలని షర్మిల తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు.