వైఎస్ షర్మిల అరెస్టు: అడ్డుకోబోయిన కార్యకర్తలు, తోపులాట, తీవ్ర ఉద్రిక్తత
వైఎస్ షర్మిల బోడుప్పల్ లో తలపెట్టిన నిరుద్యోగ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. నిరాహారదీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు వైఎస్ షర్మిలను మేడిపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.
హైదరాబాద్: నిరుద్యోగ నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతి మంగళవారం రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. మేడ్చెల్ జిల్లా బోడుప్పల్ లో ఆమె నేడు నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నించారు.
పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ఆమె దీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు చేసి షర్మిలను మేడిపల్లి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తతత చోటు చేసుకుంది. పోలీసులను అడ్డుకోవడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.
Also Read: వైఎస్ షర్మిలకు షాక్, గుట్టురట్టు: దీక్షాస్థలి వద్ద అడ్డాకూలీల ఆందోళన
పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇంతకు నిరాహార దీక్షలు చేపట్టినప్పుడు షర్మిలకు ఏ విధమైన ఆటంకాలు కలుగలేదు. తొలిసారి షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
షర్మిల నిరాహార దీక్షకు బోడుప్పల్ లో అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే కారణంగానే షర్మిల దీక్షకు అనుమతి ఇవ్వలేదని కార్యకర్లు విమర్శించారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించి బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను తన వైపు తిప్పుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.