ప్రజల్లోకి పార్టీ.. వ్యూహాత్మకంగా అడుగులు: 15 నుంచి షర్మిల నిరాహార దీక్ష
తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న వైఎస్ షర్మిల ప్రజల్లోకి తమ పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఇప్పటికే ఖమ్మంలో జరిగిన సంకల్ప సభలో షర్మిల స్పష్టం చేశారు
తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న వైఎస్ షర్మిల ప్రజల్లోకి తమ పార్టీని తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఇప్పటికే ఖమ్మంలో జరిగిన సంకల్ప సభలో షర్మిల స్పష్టం చేశారు.
దీనిలో భాగంగా నిరుద్యోగుల కోసం ఆమె నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 15 నుంచి హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష చేస్తున్నట్లు ఆమె అనుచరులు ప్రకటించారు. ఇదే విషయాన్ని షర్మిల ఖమ్మం సభలోనే ప్రకటించారు.
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని షర్మిల విమర్శిస్తున్నారు. ఆమె దీక్ష చేసినప్పటికీ సర్కారు స్పందించకుంటే ఇతర జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు కొనసాగుతాయని షర్మిల అనుచరులు తెలిపారు. తెలంగాణలో లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను ఇచ్చే వరకు నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగుతుందని వారు చెప్పారు.
Also Read:ఖమ్మం సభ: కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెట్టిన షర్మిల
కాగా నిన్నటి ఖమ్మం సభలో సీఎం కేసీఆర్పై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్ట్ను రీడిజైనింగ్ పేరుతో మార్చేశారని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్థానం చేశారని.. రైతుల పేరు మీద అప్పులు చేసి వారి జేబులు నింపుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు.
వైఎస్ఆర్ హయాంలో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని షర్మిల చెప్పారు. పేదవాడికి తక్షణం వైద్యం అందించేందుకు 15 నిమిషాల్లో 108 వచ్చిందని గుర్తుచేశారు. వైఎస్ఆర్ జంబో డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేశారని షర్మిల తెలిపారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని ఇచ్చారా.. అని ప్రశ్నించారు. ఐదేళ్లలో వైఎస్సార్ 46 లక్షల ఇళ్లు కట్టి చూపించారని షర్మిల తెలిపారు.