వినాయక నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి...
వినాయక నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఖమ్మంలో విషాదాన్ని నింపింది.

ఖమ్మం : వినాయక నిమజ్జనం ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వెలుగు చూసింది. దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.
నిమజ్జనంలో ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన మిగతా వారు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వైద్యం కోసం దగ్గర్లోని తిరువూరుకు తీసుకువెడుతుండగా.. మార్గమధ్యలోనే మృత్యువాత పడ్డాడు. దీంతో గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
రికార్డులు బ్రేక్.. హైదరాబాద్లో రూ. కోటి 26 లక్షల ధర పలికిన గణపతి లడ్డూ.. ఎక్కడంటే..
ఇదిలా ఉండగా, గుజరాత్లో ఇలాంటి విషాద ఘటనే వెలుగుచూసింది. సోమవారం నాడు ఓ19 ఏళ్ల యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. వినిత్ మెహుల్భాయ్ కున్వరియా అనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. జామ్నగర్లోని పటేల్ పార్క్ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
యువకుడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రాబోయే నవరాత్రి ఉత్సవాలకు సన్నాహకంగా పటేల్ పార్క్ ప్రాంతంలో ఉన్న గార్బా క్లాస్లో ప్రాక్టీస్ చేస్తున్న అతను మొదటి రౌండ్ పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవాళ్లు అతడిని మొదట పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి జీజీ ఆసుపత్రికి బదిలీ చేశారు. అక్కడ అతను చేరిన తర్వాత మరణించినట్లు ప్రకటించారు.
కున్వరియా కుటుంబ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ, జామ్నగర్లోని 'స్టెప్ అండ్ స్టైల్ దాండియా అకాడమీ'లో ప్రాక్టీస్ చేస్తుండగా, సోమవారం రాత్రి 10:30 గంటలకు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని చెప్పారు. 19 ఏళ్ల యువకుడైన కున్వర్ కి ఎటువంటి అనారోగ్యం లేదని, పూర్తి ఆరోగ్యవంతంగా ఉండేవాడని ఆయన తెలిపారు.
ముఖ్యంగా, యువకులలో గుండె సమస్యలకు సాధారణ కారణాలు గుండె జబ్బులకు చెందిన ఫ్యామిలీ హిస్టరీ, మధుమేహం, రక్తపోటు, జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి వైద్య పరిస్థితులు కలిసి ఉన్నాయి.
కున్వరియాలాంటి అనేక మరణాలు వెలుగులోకి రావడంతో ఇలాంటి ఘటనలు వైద్య నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో, ఒక యువకుడు ట్రెడ్మిల్పై పరిగెత్తుతూ జిమ్లో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఘజియాబాద్లోని సరస్వతి విహార్లో చోటుచేసుకుంది. బాధితుడు, సిద్ధార్థ్ కుమార్ సింగ్, తన వ్యాయామ దినచర్యలో అకస్మాత్తుగా, ప్రాణాంతకమైన గుండెపోటుతో మరణించాడు.