కొడుకు కాపురం నిలబెట్టాలని తండ్రి.. తప్పుగా అర్థంచేసుకొని..
తండ్రి తనకోసం తాపత్రయపడుతున్నాడన్న విషయం అర్థం చేసుకోని కొడుకు.. అపార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తన కళ్లముందే కొడుకు, కూడలు దూరమవ్వడం చూసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా కొడుకు కాపురం చక్కదిద్దాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆయన పోలీసులను కూడా ఆశ్రయించాడు. కానీ.. అదే అతను చేసిన నేరమయ్యింది. తండ్రి తనకోసం తాపత్రయపడుతున్నాడన్న విషయం అర్థం చేసుకోని కొడుకు.. అపార్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన ఐలపాక పవన్ కళ్యాణ్(24)కు సత్తుపల్లికి చెందిన రామకృష్ణవేణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే.. పెళ్లైన ఏడాదికే భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. దీంతో కృష్ణవేణి తన పాపతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
గత నెల 14న పవన్ కళ్యాణ్ తల్లి బుల్లెమ్మ(45) గుండెపోటుతో మరణించడంతో.. అంత్యక్రియలకు హాజరైంది. అప్పుడు భర్తతో కలిసి జీవిద్దామని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయితే.. అతను వినకపోవడంతో మామ శ్రీను సహాయం కోరింది. కొడుకు, కోడలు కలిసి ఉంటే బాగుంటుందని అతను కూడా భావించాడు.
కోడలికి మద్దతుగా కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుంటే అయినా.. కొడుకు మారి కోడలిని ఇంటికి తీసుకువస్తాడని భావించాడు. కానీ.. తండ్రి అలా తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల పవన్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
తన శవాన్ని తన తండ్రి అంటుకోవడానికి కూడా వీళ్లేదంటూ.. సూసైడ్ నోట్ రాసి పెట్టడం గమనార్హం. కాగా.. పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.