వద్దంటున్నా ప్రేమిస్తున్నానని వెెంటపడుతూ చివరకు ఉన్మాదిలా మారాడు. ఇంట్లోకి చొరబడి మరీ ప్రేమించిన యువతి చంపేందుకు ప్రయత్నించాడో యువకుడు. 

కరీంనగర్ : కొన్నేళ్ళుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు... కానీ ఆమె అంగీకరించడం లేదు. దీంతో ఉన్మాదిలా మారిన యువకుడు ప్రేమించిన అమ్మాయినే చంపేందుకు సిద్దమయ్యాడు. యువతిపై దాడి చేసి కత్తితో గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించగా ఎలాగోలా వాడి బారినుండి తప్పించుకుంది. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ పట్టణ శివారులోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి పిజి పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆమె ఇంటి ఎదురుగానే బొద్దుల సాయి అనే యువకుడు నివాసముంటున్నాడు. అయితే ఎదురింట్లో వుండే యువతిని ఇష్టపడ్డ సాయి కొన్నేళ్లుగా ప్రేమపేరిట వెంటపడుతున్నాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేవని యువతి ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ప్రేమను అంగీకరించాలంటూ వెంటపడేవాడు. 

అయితే నాలుగేళ్ళుగా సాయి వేధింపులు భరిస్తూవస్తున్న యువతి ఇక సహించలేకపోయింది. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వాళ్లు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అందరూ కలసి మందలించడంతో ఇక యువతి వెంటపడనని సాయి ఒప్పుకున్నాడు. కానీ అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు... పంచాయితీ తర్వాత కూడా యువతిని వేధించడం ఆపలేదు. 

Also Read అన్నను స్కూల్ కు పంపించేందుకు వచ్చి.. బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మరణం..

ఇన్నేళ్ళుగా తను ఎంత వెంటపడుతున్నా యువతి పట్టించుకోకపోవడంతో సాయి ఉన్మాదిలా మారిపోయాడు. ప్రేమించిన యువతి ప్రాణాలు తీసేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం తల్లిదండ్రులు బయటకు వెళ్ళగా యువతి ఇంట్లో ఒంటరిగా వుండటాన్ని సాయి గమనించాడు. వెంటనే ఇంట్లోకి చొరబడి యువతిపై దాడిచేసి కత్తితో గొంతుకోసం హతమార్చేందుకు ప్రయత్నించాడు. కానీ యువతి అరుపులు విని చుట్టుపక్కల ఇళ్లవారు చేరుకుని సాయిని అడ్డుకున్నారు. దీంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. 

ప్రేమోన్మాది దాడిలో యువతి పన్నువిరగడంతో పాటు చేయికి గాయమైంది. దాడి విషయం తెలిసి వెంటనే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కూతురిని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. యువతి తండ్రి వీరేశం ఫిర్యాదుమేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి పరారీలో వున్న సాయి కోసం గాలింపు చేపట్టారు.