కేటీఆర్ ఇలాకాలో నిరుద్యోగి ఆత్మహత్య... అదే గ్రామంలో నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల (వీడియో)
ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల అతడి గ్రామంలోనే నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.
సిరిసిల్ల: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ నుండి కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చేరుకున్న షర్మిల ఇటీవల ఆత్మహత్య చేసుకున్ని నిరుద్యోగి మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. మహేందర్ ఇంటికి వెళ్ళిన ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. చేతికందివచ్చిన కొడుకు మృతిని తలచుకుంటూ బోరున విలపించిన మహేందర్ తల్లిని ఆలింగనం చేసుకుని ఓదార్చారు షర్మిల.
ఇలా మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం షర్మిల గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్నారు. తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసిన అక్కడే ఒక రోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు వైఎస్ షర్మిల.
వీడియో
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తానని షర్మిల ప్రకటించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. అందులో భాగంగానే ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో దీక్ష చేపట్టారు షర్మిల.
read more మేఘా కంపెనీకి డబ్బులిస్తేనే కేసీఆర్కు కమిషన్లు : షర్మిల ఘాటు వ్యాఖ్యలు
గత మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో దీక్ష చేపట్టారు షర్మిల. పుల్లెంల గ్రామంలో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబాన్ని షర్మిల తొలుత పరామర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్ష చేపట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో తాను రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ఆమె ప్రకటించారు చేవేళ్ల నుండి పాదయాత్ర చేస్తానని గతంలో ఆమె ప్రకటించారు. త్వరలోనే ఆమె పాదయాత్రను ప్రారంభించనున్నారు.