కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది: హెల్త్ బులెటిన్ విడుదల, ఆసుపత్రికి హెల్త్ సెక్రటరీని పంపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కేసీఆర్ ఎడమ తుంటికి గాయంతో నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
![Yashoda Hospital Releases Telangana Former chief Minister Kalvakuntla Chandrashekar Rao Health bulletin lns Yashoda Hospital Releases Telangana Former chief Minister Kalvakuntla Chandrashekar Rao Health bulletin lns](https://static-ai.asianetnews.com/images/01heyg327ah570st7rj5yb7q31/cm-kcr--2--jpg_363x203xt.jpg)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు శుక్రవారం నాడు ప్రకటించారు.
తన వ్యవసాయ క్షేత్రంలో బాత్రూంలో కాలుజారి పడడంతో గురువారం నాడు రాత్రి యశోద ఆసుపత్రిలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్ ను పరీక్షించిన తర్వాత యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. బాత్రూంలో జారిపడడంతో కేసీఆర్ ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందని వైద్యులు ప్రకటించారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి కేసీఆర్ కు ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని యశోద ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే కేసీఆర్ కు సీటీ స్కాన్ తో పాటు ఎడమ తుంటికి శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు.
కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వైద్య,ఆరోగ్యశాఖాధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు.మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీ కి చెప్పిన యశోద ఆసుపత్రి వైద్యులు వివరించారు.
కెసిఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని రిజ్వి ఆసుపత్రి వర్గాలకు తెలిపారు.
కేసీఆర్ బాత్రూంలో జారిపడిన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో కేసీఆర్ ను నిన్న ఆసుపత్రికి తీసుకువచ్చారు పోలీసులు.