గీత మా కూతురే: యాకయ్య, శాంత దంపతులు
పాకిస్తాన్ నుండి ఇండియాకు తిరిగివచ్చిన మూగ యువతి గీత తమ అమ్మాయేనని మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు చెప్పారు.
మహబూబాబాద్: పాకిస్తాన్ నుండి ఇండియాకు తిరిగివచ్చిన మూగ యువతి గీత తమ అమ్మాయేనని మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారు రాయినిపట్నానికి చెందిన కోల యాకయ్య, శాంత దంపతుల కూతురు చిన్నప్పుడే ఇంటి నుండి వెళ్లి పోయింది.
పుట్టుకతోనే ఆమెకు మాటలు రావని తల్లిదండ్రులు చెప్పారు. 15 ఏళ్ల క్రితం తమ కూతురు ఇంటి నుండి తప్పిపోయిందని ఆ దంపతులు చెప్పారు.
మంగళవారం నాడు బాసరకు గీతను ఇండోర్ కు చెందిన స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు తీసుకొచ్చారు. తాను చిన్నప్పుడు దేవాలయం, రైల్వే స్టేషన్ నది ఉన్న ప్రాంతంలో నివసించినట్టుగా ఆమె తెలిపారు.
చిన్నతనంలోనే ఆమె రైలెక్కి పాకిస్తాన్ కు వెళ్లిపోయింది. సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ నుండి ఆమెను ఇండియాకు రప్పించారు.
గీత బాసరలో తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న దృశ్యాలను టీవీ చానెల్ లో చూసిన యాకయ్య, శాంత దంపతులు గీత తమ కూతురేనని చెప్పారు.
15 ఏళ్ల క్రితం తమ కూతురు తప్పిపోయిందని మీడియాకు చెప్పారు. తమ కూతురికి సౌజన్యగా పేరు పెట్టామన్నారు. చిన్నతనం నుండి తమ కూతురికి మాటలు రావన్నారు. సైగల ద్వారానే తాను చెప్పాలనుకొంది చెప్పేదన్నారు.
2005లో తాము ఉపాధి కోసం హైద్రాబాద్ సుచిత్ర ప్రాంతానికి వచ్చామన్నారు. తన కూతురిని ఇంటి వద్దే ఉంచామన్నారు. పని నుండి ఇంటికి తిరిగి వెళ్లేసరికి తమ కూతురు కన్పించలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
also read:బాసరలో గీత: తల్లిదండ్రుల కోసం అన్వేషణ
సౌజన్య కోసం గాలించినా ఫలితం లేకుండాపోయిందని చెప్పారు. తన బిడ్డ దుస్తులను చూసుకొంటూ జీవిస్తున్నామని వారు చెప్పారు. సౌజన్య కుడి ముఖంపై కంటి పక్కన పుట్టుమచ్చలు ఉన్నాయని వారు చెప్పారు. గీతను చూస్తే తమ కూతురి మాదిరిగానే ఉందని వారు అభిప్రాయపడ్డారు. గీతను తమ వద్దకు తీసుకొస్తే ఆమెను చూసి గుర్తుపడుతామని వారు చెప్పారు.