ఆదాయం విషయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఆదివారం రెండో సారి అత్యథిక ఆదాయంతో రికార్డు సాధించింది. 

యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈ ఆదివారం భక్తులతో కోలాహలంగా మారిపోయింది. కార్తీక మాసం చివరి వారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. మామూలుగానే ఆదివారం యాదగిరి గుట్టలో రష్ ఎక్కువగా ఉంటుంది. ఇక దీనికి కార్తీక మాసం చివరి రోజు కూడా తోడవడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక దీపారాధన, శివాలయం, వ్రత మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వీటితో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. 

పార్కింగ్ ఏరియా, కల్యాణకట్ట, బస్ బే, ప్రసాదం, దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. ఈ రద్దీతో స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. కొండపైన ప్రధాన ఆలయ ప్రాంగణం, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండ కింద రథ మండపం, లక్ష్మీ పుష్కరిణి వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పోవడానికి వీలుగా దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహ స్వామిని భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకుని, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

రికార్డు స్థాయిలో ఒక్కరోజే కోటికి పైగా ఆదాయం.. యాదాద్రి ఆలయ చరిత్రలోనే మొదటిసారి..

రికార్డు స్థాయి ఆదాయం..
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా రూ. 1,16,13,977ల ఆదాయం లభించిందని ఆలయ ఈవో తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,24,650, కైంకర్యాలు రూ.16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, ప్రచార శాఖ రూ..2,87,500, విఐపి దర్శనం రూ.18,90,000, యాద ఋషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం ద్వారా రూ44,37,150, పాతగుట్ట రూ.3,78,670, కల్యాణకట్ట రూ.1,78,000, శాశ్వత పూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, కొండ పైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 9,75,000, సువర్ణ పుష్పార్చన రూ. 2,52,348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాలయం రూ.32,600, అన్నదానం రూ.55,659, బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.9,75,000లు ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ట్రాఫిక్ జామ్..
కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు విపరీతంగా పోటెత్తారు. దర్శనం తరువాత సాయంత్రం భక్తులు తిరిగి ప్రయాణం అవ్వడంతో.. ఆ రద్దీ అంతా జాతీయ రహదారి 163పై కనబడింది. వరంగల్-హైదరాబాదు మార్గంలో గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా బార్లు తీరాయి. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంది. యాదగిరిగుట్ట నుంచి వస్తున్న వాహనాలకు తోడు వరంగల్ నుంచిహైదరాబాద్ కు వచ్చే వాహనాలు ఒక్కసారిగా టోల్ ప్లాజాకు చేరుకున్నాయి. దీంతో అర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. టోల్ప్లాజా మేనేజర్ సుదీర్ తన సిబ్బందితో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలా రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నించారు. టోల్ప్లాజాలో 13 కౌంటర్లు ఉండగా 9 కౌంటర్లు వరంగల్-హైదరాబాద్ మార్గం వైపు కేటాయించి రద్దీని నియంత్రించారు.