మంత్రి పువ్వాడ జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోను.. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
మంత్రి పువ్వాడ అజయ్పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన నియోజకవర్గం వైరాలో మంత్రి పువ్వాడ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి పువ్వాడ అజయ్పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన నియోజకవర్గం వైరాలో మంత్రి పువ్వాడ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైరాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్పై విమర్శలు గుప్పించారు. దళితబంధులో కొంత మంది లబ్దిదారుల ఎంపికను మదన్లాల్కు ఇచ్చారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తన విధులకు ఆటంకలం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తన నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్పై విజయం సాధించారు. ఆ తర్వాత చోటుచేసుకన్న పరిణామాలతో రాములు నాయక్ బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. వైరాలో మాత్రం రాముల్ నాయక్కు టికెట్ నిరాకరించారు. వైరా నుంచి భానోతు మదన్ లాల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
కొన్ని క్షుద్ర శక్తులు తనకు టికెట్ రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న నాయకులు సీటు రావడానికి సహకరించలేదని అన్నారు. మరో మూడు నెలల సమయం ఉందని ఈలోగా ఏదైనా జరగొచ్చని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు. అయితే తాజాగా దళిత బంధు లబ్దిదారుల ఎంపిక మదన్ లాలు, రాములునాయక్ల మధ్య రచ్చకు కారణమైనట్టుగా తెలుస్తోంది.