ఆదివాసులకు కేసిఆర్ ఇప్పటికే చేసింది... ఇకపై చేయబోయేది ఇదే...: మంత్రి ఎర్రబెల్లి
ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్బంగా తెలంగాణలోని ఆదివాసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ ఆదివాసుల అభ్యున్నతికి ఏమేం చేస్తోందో వివరించారు.
ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... సీఎం కెసిఆర్ సబ్బండ వర్గాల ప్రజలతో పాటు ఆదివాసీ, గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసులకు అన్ని మౌళిక వసతులు కల్పించదానికి ప్రభుత్వం కోట్లాది రూపాయాల నిధులు ఖర్చు చేస్తుందని వెల్లడించారు.
అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని... అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు స్వావలంబన ప్రసాదించే దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఎర్రబెల్లి చెప్పారు.
read more భువనగిరిలో దళిత బంధు ఇస్తే.. ఇప్పుడే రాజీనామా , మళ్లీ పోటీ చేయను: కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్
ఇక దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను తమ ప్రభుత్వం ప్రపంచానికి తెలంగాణ ఉనికి చాటేలా అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం వర్ధంతిని అధికారికంగా ఘనంగా జరపడంతో పాటు జోడేఘాట్ అభివృద్దికి రూ.25 కోట్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కోసం రూ. 7 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.
కేస్లాపూర్లోని నాగోబా జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. నాగోబా ఆలయ విస్తరణ, దర్భార్ నిర్మాణం, రోడ్ల అభివృద్దికి నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఇక మైదాన గిరిజనుల కోసం ప్రత్యేకించి ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి 'మా తాండాలో మా రాజ్యం' అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.