వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే చంపేసిన తల్లి...
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకునే ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ తల్లి. తరువాత శవాన్ని దగ్గర్లోని నీటి కుంటలో పడేసి.. కొడుకు కనిపించడం లేదంటూ డ్రామా మొదలుపెట్టింది.
మహబూబ్ నగర్ : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకునే అతి కిరాతకంగా హతమార్చింది కన్నతల్లి. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన పాపయ్యతో మహబూబ్ నగర్ కు చెందిన దాయమ్మకు 30 ఏళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వెంకటేష్ (29) ఉన్నారు. అనారోగ్యంతో పాపయ్య పదేళ్ల కిందట మృతిచెందాడు. తర్వాత అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ తో దాయమ్మకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం తెలుసుకున్న కొడుకు వెంకటేష్, దాయమ్మ, శ్రీనివాస్లతో తరచూ గొడవ పడేవాడు. నిత్యం గొడవ పడుతుండడంతో అతడిని చంపి, అడ్డు తొలగించుకోవాలని దాయమ్మ, శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న వెంకటేష్కు మద్యం తాగించారు. మత్తులో ఉన్న వెంకటేశ్వర పై కర్రతో బలంగా కొట్టారు. అతను వెంటనే చనిపోగా ఇంటికి సమీపంలో ఉన్న మోతుకులకుంటలోని నీళ్లలో మృతదేహాన్ని పడేశారు. ఇందుకు శ్రీనివాస్ అల్లుడు నరసింహులు కూడా సహకరించాడు.
బుధవారం దాయమ్మ కొడుకు కనబడడం లేదని స్థానికుల ముందు కంటతడి పెట్టుకుంది. స్థానికులు వెంకటేష్ ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో ఇంటిముందున్న దాయమ్మ మెల్లగా అక్కడి నుంచి జారుకుని గ్రామం విడిచి వెళ్లిపోయింది. అప్పటికే శ్రీనివాస్, నర్సింలు కూడా గ్రామం నుంచి పారిపోయారు. స్థానికులకు మోతుకులకుంటలో వెంకటేష్ మృత దేహం కనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంకటేష్ శవాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. దాయమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి పెళ్లిళ్లు అయ్యాయి.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 20న నిర్మల్ జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే.. ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని అపహరించి తీసుకువెళుతూ తుపాకీతో పాటు గ్రామస్తులకు పట్టుబడిన సంఘటన ఇది.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగల భయంతో నిత్యం గ్రామంలో రాత్రివేళ గస్తీ తిరుగుతున్నారు. ఆ రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో గ్రామం నుంచి ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వెడుతున్నారు.
వాహనం నెంబర్ ప్లేట్ లో నెంబర్ కనపడకుండా చేయడంతో గస్తీ తిరుగుతున్న వారికి అనుమానం వచ్చి ఆపారు...పేరు వివరాలు అడగగా డొంకతిరుగుడు సమాధానం చెప్పడంతో పాటు వారి వద్ద 9 ఎంఎం పిస్టల్ ఉండడంతో పోలీసులకు ఉప్పందించారు. వారు ముగ్గురు వ్యక్తులనూ సారంగాపూర్ ఠాణాకు తరలించారు, ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేటలో ఆర్.ఎం.పీగా పనిచేస్తున్న ఎచిర్యాల రవికుమార్ ను అపహరించి తీసుకు వెళుతూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. కిడ్నాపర్ల వద్ద తుపాకీ, రెండు బుల్లెట్లు లభించాయి. అసలు తుపాకీ వారి వద్దకు ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎక్కడ కొన్నారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
అయితే, ఆర్ఎంపీ రవికుమార్ సారంగాపూర్ మండలంలోని జౌళి గ్రామానికి చెందిన ఓ మహిళ వద్దకు వచ్చినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. వీరు ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కైలాస్ టేకిడికి కారులో వెళ్తుండగా సదరు మహిళకు మరిదైన బానోతు మారుతి, మరో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెంబడించి రవికుమార్ ను అపహరించారు. రాత్రి సమయంలో అతడిని తరలిస్తూ వంజర్ గ్రామస్థులకు దొరికిపోయారు.