కారణమిదీ: తహసీల్దార్ కాళ్లు పట్టుకొన్న మహిళా రైతు
తమ భూమిలో స్మశాన వాటిక నిర్మించొద్దని కోరుతూ ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కాళ్లు పట్టుకొన్నారు. తమ భూమిలో స్మశాన వాటిక నిర్మిస్తే ఆత్మహత్య చేసుకొంటామని హెచ్చరించారు.
బయ్యారం: తమ భూమిలో స్మశాన వాటిక నిర్మించొద్దని కోరుతూ ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కాళ్లు పట్టుకొన్నారు. తమ భూమిలో స్మశాన వాటిక నిర్మిస్తే ఆత్మహత్య చేసుకొంటామని హెచ్చరించారు.
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం నర్సాతండాలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ తండాలో స్మశాన వాటిక నిర్మాణం కోసం సర్వే కోసం బయ్యారం తహసీల్దార్ తరంగిని నర్సాతండాకు వచ్చారు.
ఈ తండాలోని కోడి బిక్షం, సోమమ్మ దంపతులకు చెందిన వ్యవసాయ భూమిలో స్మశాన వాటిక నిర్మాణం కోసం రెవిన్యూ అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధిత కుటుంబం తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు.
పల్లె ప్రగతి కార్యక్రమం కింద తమ భూమిని ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని రైతు కుటుంబం తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. తమ జీవనాధారమైన వ్యవసాయ భూమిని తీసుకోవద్దని తహసీల్దార్ ను రైతు కోరారు.
తమ భూమిని తీసుకొంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని సోమమ్మ తహసీల్దార్ తరంగిణి కాళ్లు పట్టుకొంది. తమ భూమిని స్మశాన వాటికకు ఇచ్చే ప్రసక్తే లేదని రైతు కుటుంబం తేల్చి చెప్పింది.