యాదాద్రి జిల్లాలో విషాదం... పోలీస్ కస్టడీలో మహిళ మృతి
ఓ మహిళ పోలీస్ కస్టడీ వుండగానే మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
భువనగిరి: దొంగతనానికి పాల్పడిందన్న అనుమానంతో అరెస్ట్ కాబడిన ఓ మహిళ పోలీస్ కస్టడీ వుండగానే మృతిచెందింది. అయితే ఆమె అస్వస్థతకు గురయి చనిపోయిందని పోలీసులు చెబుతుంటే మృతురాలి కుటుంబసభ్యులు మాత్రం పోలీసులు హింసించడం వల్లే మరణించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ(50) కొన్ని నెలల కింద భువనగిరి జిల్లాలోని గోవిందాపురం చర్చిలో పనికి కుదిరింది. అక్కడే నివాసముంటున్న ఆమె వద్దకు ఇటీవల కొడుకు ఉదయ్ కిరణ్ వచ్చాడు. మూడు రోజులపాటు అక్కడే వుండి తల్లిని తీసుకుని స్వగ్రామానికి వెళ్లాడు.
read more ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక శవం: హత్య చేసి నిప్పు పెట్టారని అనుమానం
ఆ తర్వాతి రోజే చర్చి ఫాదర్ బాలశౌరి తన ఇంట్లో నగదు చోరీకి గురయినట్లు గుర్తించాడు. దాదాపు రూ.2లక్షల వరకు చోరీకి గురవడంతో అతడు పోలీసులకు పిర్యాదు చేశారు. మరియమ్మపై అనుమానం వ్యక్తం చేయగా విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నారు అడ్డగూడురు పోలీసులు.
విచారణ సమయంలో మరియమ్మ పోలీస్ స్టేషన్ లోనే అస్వస్థతకు గురవగా పోలీసులు భువనగిరి హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుల వేధింపుల వల్లే మరియమ్మ మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.