చెల్లి జీవితం నిలబెట్టాలని భర్తతో రెండో పెళ్లి.. అక్కమీది కోపంతో 5 నెలల కొడుకుని హత్య చేసి బావిలో పడేసిన తల్లి
అక్కమీది కోపంతో చెవిటి, మూగ అయిన ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఐదు నెలల కొడుకును చంపేసి, బావిలో వేసి దొంగలు ఎత్తుకెళ్లారని నాటకం ఆడింది.
మహబూబ్ నగర్ : దివ్యాంగురాలు అయినా చెల్లిని చేరదీసి, తన భర్తకు ఇచ్చి రెండో వివాహం చేసి, ఆమెకు జీవితాన్ని ఇచ్చింది ఓ అక్క. అదే అక్కపై కోపంతో ఆ చెల్లెలు.. తన కన్నబిడ్డను హత్య చేసింది. తర్వాత నిద్రలో ఉండగా తన బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ.. అర్థరాత్రి హంగామా సృష్టించింది ఓ కసాయి తల్లి. తప్పించుకునేందుకు చేసిన హైడ్రామా కథ బెడిసికొట్టడంతో అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన నారాయణపేట జిల్లా కోస్గిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కోస్గిలోని ఎస్సీ కాలనీకి చెందిన మద్దూరు గోవింద్ కు కర్ణాటక రాష్ట్రంలోనే కానగడ్డకు చెందిన మొగులమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే, మొగలమ్మకు ఓ చెల్లెలు కాశమ్మ ఉంది. ఆమె పుట్టుకతోనే మూగ, చెవుడు కావడంతో తన చెల్లెలి జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టాలని అనుకుంది మొగులమ్మ. అందుకోసం తన భర్త గోవిందును ఒప్పించి రెండేళ్లక్రితం చెల్లితో రెండో వివాహం జరిపించింది. కుటుంబ విషయమై అక్క చెల్లిని అప్పుడప్పుడు మందలిస్తూ ఉండేది. ఈ క్రమంలో రెండు రోజులుగా అక్క చెల్లెళ్ళ మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.
దీంతో అక్కపై కోపం పెంచుకుంది కాశమ్మ. శనివారం ఇంట్లో అందరూ భోజనాలు చేసి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి తన సొంత కొడుకుని తీసుకువెళ్లి హత్య చేసింది. ఆ తరువాత పట్టణ శివారులోని శంభుని గుడి సమీపంలో ఉన్న నీళ్ల బావిలో పడేసింది. ఇంటికి వచ్చిన కాశమ్మ తన బాబును ఎవరో ఎత్తుకు వెళ్లారని కుటుంబ సభ్యులకు రోదిస్తూ సైగ చేసింది. అయితే, కొన్ని రోజులుగా కాలనీలో దొంగలు తిరుగుతున్నారని పుకార్లు ఉండడంతో కాలనీ మొత్తం మేలుకొంది. కొందరు యువకులు కాలనీలో మొత్తం గాలించారు. అయినా బాబు ఆచూకీ దొరకకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆదివారం ఉదయం కాలనీకి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవ జరగడంతో బాబుని కుటుంబ సభ్యులే ఏదో చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట మొగులమ్మపై అనుమానం వచ్చినప్పటికీ.. పోలీసులు బాధిత కుటుంబ సభ్యులందరినీ స్టేషన్ కు తరలించారు. తమదైన శైలిలో విచారించడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన కాశమ్మ అక్కమీద కోపంతో క్షణికావేశంలో తన బిడ్డను తానే చంపి, బావిలో వేసినట్లు ఒప్పుకుంది. బాబుని వేసిన భావించి చూపించడంతో.. పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. తరువాత పోస్టుమార్టం చేయించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్వర్రెడ్డి తెలిపారు.