మునుగోడు బై పోల్: మూడు రోజులు వైన్ షాపులు బంద్.. పూర్తి వివరాలు ఇవే..
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్ షాప్లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నల్గొండ జిల్లా ఎక్సైజ్ అధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్ షాప్లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 3 వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా పేర్కొన్నారు. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్టుగా చెప్పారు. అలాగే నవంబర్ 6వ తేదీన వైన్స్లు మూసే ఉంచాలన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైన్ షాపులను మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం ఆదేశించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ (నారాయణపూర్ పోలీస్ స్టేషన్, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ల మధ్య) పరిధిలోని రెస్టారెంట్లలో నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 నుంచి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడతాయని చెప్పారు. అయితే.. స్టార్ హోటళ్లలో బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు తెరిచి ఉంచేందుకు అనుమతించబడతాయి.
ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.