సర్వే నిజమా: తెలంగాణలో కాంగ్రెసుకు అన్ని సీట్లు వస్తాయా?
తెలంగాణ కాంగ్రెసు నాయకులు రాష్ట్రంలో గెలుపు ఆశతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము మెజారిటీ సీట్లు సాధిస్తామని చెబుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు నాయకులు రాష్ట్రంలో గెలుపు ఆశతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము మెజారిటీ సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. తమకు 119 సీట్లలో 72 సీట్లు వస్తాయని, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 38 సీట్లకే పరిమితమవుతాయని వారు నమ్ముతున్నారు.
ఆ మేరకు తెలంగాణ కాంగ్రెసు నేతలు ఆదివారం జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో అధిష్టానానికి ఓ నివేదికను సమర్పించారు. సిడబ్ల్యుసి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కె జానారెడ్డి, షబ్బీర్ అలీ, హనుమంతరావు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఏ విధమైన అవకాశాలున్నాయనే విషయాన్ని వారు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సడబ్ల్యుసి సమావేశంలో వివరించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారంటున్నారు.
టీఆర్ఎస్ తమను మోసం చేసిందని యువకులు, రైతులు మహిళలు ఆగ్రహంతో ఉన్నారని వారంటున్నారు. వారంతా తమ వైపు చూస్తున్నారని వారు నమ్ముతున్నారు.