Revanth Reddy : ఎన్నారైలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వారిని కోరారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే వరకు తాము పోరాడుతామని అన్నారు.
TPCC president Revanth Reddy: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి లభించేంత వరకు పోరాడుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. అమెరికాలోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. "నేను, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాణాలు కోల్పోయినా పోరాటాన్ని విరమించబోము.. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుతాం" అని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ఓడించేందుకు ఎన్నారైల మద్దతు అవసరమన్నారు. తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలు తమ జీవితాల్లో ఎన్నో విజయాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన ఎన్నారైలు అమెరికా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నారైలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టిడిఎఫ్) ఏర్పాటు చేసి రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేశారని, యువత, విద్యార్థుల త్యాగాలను చూసి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఎన్నారైలకు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ అనేక రాజకీయ పార్టీలను ఒప్పించిందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీని గెలిపించి పార్టీని గెలిపించి సోనియా గాంధీకి కానుకగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఏర్పాటు ప్రధాన లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. ఖమ్మంలో ఓ యువకుడు నడుస్తున్న రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనను రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, తెలంగాణలో ప్రతిరోజూ ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను రక్షించేందుకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. పల్లెల నుంచి వచ్చిన తెలంగాణ నిపుణులు అమెరికా కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదగడం చూసి తాము సంతోషంగా ఉన్నామని రేవంత్ అన్నారు.
తమ స్వగ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి 'మహాయజ్ఞం'లో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి విదేశీ భారతీయులకు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమం తారాస్థాయికి చేరకముందే అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ను ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణా తెచ్చుకున్నామన్న మాటతోనే ప్రజలు కేసీఆర్కు రెండుసార్లు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్కు అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని ఎన్నారైలు గుర్తించి కృతజ్ఞతలు తెలపాలని కోరారు.
