TS News: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు మూడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చాయి.  

వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇస్తే భర్తను నమ్మించి.. మైసమ్మ గుడి వద్దకు పంపింది. భార్య మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన అతడిని.. సుపారీ గ్యాంగ్ హత్య చేసింది. అనంతరం అతడి మృతుడిని పాతి పెట్టింది. ప్రియుడి మోజులో పడిన మహిళ ఈ దారుణానికి ఓడిగట్టింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు మూడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చశారు. 

వివరాలు.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన మేస్త్రీ బాలస్వామికి పదేళ్ల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. మ‌ద‌నపూర్‌కు చెందిన న‌వీన్ అనే యువ‌కుడు అప్పుడ‌ప్పుడు గాంధీన‌గ‌ర్‌కు వ‌స్తుండేవాడు. ఈ క్రమంలోనే అతడికి లావణ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే బాలస్వామి, లావణ్యలకు మధ్య తరచూ గొడవలు జరిగాయి. 

అయితే బాల‌స్వామి 5 నెల‌ల క్రితం త‌న‌కున్న పొలాన్ని అమ్మాడు. దీంతో రూ. 30 ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఆ డ‌బ్బు తీసుకుని ప్రియుడు నవీన్‌తో వెళ్లిపోవాలని లావణ్య ప్లాన్ వేసింది. ఇందుకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకుంది. ప్లాన్‌లో భాగంగా.. పట్టణ శివారులోని జేరిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్ధరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని లావణ్య భర్తను నమ్మించింది. దీంతో ఈ ఏడాది జనవరి 21న రాత్రి కోడిపుంజును బలి ఇవ్వడానికి బాలస్వామి మైసమ్మ గుడి వద్దకు వెళ్లాడు. 

అయితే అప్పటికే అక్కడ వేచి ఉన్న న‌వీన్, సుపారీ గ్యాంగ్‌కు చెందిన కురుమూర్తి, బంగార‌య్య‌, గ‌ణేశ్‌లు.. బాలస్వామిని దారుణంగా హత్య చేశారు.  అనంతరం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని బాలాపూర్ ప్రాంతంలో బాలస్వామి మృతదేహాన్ని పాతిపెట్టారు. 

బాలస్వామి కనిపించకపోవడం.. మరో వైపు లావణ్య కూడా ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన బాలస్వామి తమ్ముడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక, ఇటీవల లావణ్య, నవీన్‌లను అదుపులోకీ తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాలస్వామిని హత్య చేసిన సుపారీ గ్యాంగ్ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలస్వామి మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టమ్ చేయించారు.