కాబోయే భర్తకు  ‘సర్ ఫ్రైజ్’ గిఫ్ట్ అంటూ గొంతు కోసిన యువతి ఉదంతం మరువకముందే.. అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను కోడిపుంజు బలివ్వాలనే పేరుతో అర్థరాత్రి అమ్మవారి గుడికి పంపి చంపించింది ఓ భార్య. 

వనపర్తి : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే.. లేదా చేసుకున్న పెళ్లి నచ్చకపోతే తప్పుకోవడానికి.. తప్పించుకోవడానికి.. వదులుకోవడానికి చాలా దారులు ఉంటాయి. అలా కాకుండా ఏకంగా హత్యలకు తెగబడడమే దారుణంగా మారుతోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య భర్తను సుపారీగ్యాంగ్ తో కలిసి చంపించింది. 

పెళ్లి ఇష్టం లేని యువతి ‘సర్ ప్రైజ్... కళ్లు మూసుకో..’ అంటూ కాబోయేవాడి గోంతు కోసేసింది. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండానే.. ఓ మహిళ తన భర్తను ఇలాగే ‘సర్ ఫ్రైజ్’ చేసింది. ఇంట్లో ఏమీ బాగోలేదు. గ్రామదేవతకు కోడి పుంజును బలి ఇద్దామని భర్తను చెప్పింది. అదీ అర్థరాత్రి బలిస్తే మంచిదని నమ్మించి ఒక్కడినే పంపించింది. అప్పటికే అక్కడ తన ప్రియుడిని, సుపారీ గ్యాంగ్ ను సిద్ధంగా ఉంచింది.

భర్తను చంపి పాతిపెట్టించింది. పొలం అమ్మితే వచ్చిన రూ. 30లక్షలు తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది. 3 నెలలయ్యింది. ఇంట్లో ఆయన, ఆమె లేరు. ఏమైందో ఎవరికీ తెలియదు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ మిస్టరీ తాజాగా బయటపడింది. స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు.

వివాహేతర సంబంధంతో...
వనసర్తిలోని గాంధీనగర్ కు చెందిన మేస్త్రీ బాలస్వామి (39)కి లావణ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మదనాపురం మండలం దంతనూర్ చెందిన నవీన్ అనే యువకుడికి లావణ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనిమీద భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. 5 నెలల క్రితం బాలస్వామి పొలం అమ్మడంతో రూ.30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని ప్రియుడు నవీన్ తో వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. కానీ, భర్త మళ్లీ ఎక్కడ అడ్డువస్తాడోనని చంపేయాలని ప్లాన్ చేసుకుంది. 

కోడిపుంజు పేరుతో...
వనపర్తి శివారులోని జేరిపోతుల మైసమ్మ గుడి వద్ద అర్థరాత్రి కోడిపుంజును బలిస్తే మంచి జరుగుతుందని, ఇంట్లో గొడవలు తగ్గుతాయని భర్తను లావణ్య నమ్మించింది. ఈ ఏడాది జనవరి 21న అర్థరాత్రి ఒక్కడినే మైసమ్మ ఆలయానికి పంపింది. అప్పటికే వేచి ఉన్న నవీన్, సుపారీ గ్యాంగ్ కురుమూర్తి, గణేశ్ కలిసి బాలస్వామి గొంతు నులిమి చంపేశారు. కందూరు శివార్లలోని బ్రిడ్జి వద్ద అతడి సెల్ ఫోన్ ను పడేశారు. బంగారి అనే వ్యక్తి సాయంతో మృతదేహాన్ని హైదరాబాద్ లోని బాలాపూర్ శివారుకు తీసుకువెళ్లి పాతిపెట్టారు. 

హత్య బయటపడిందిలా...
బాలస్వామి కనిపించకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి తమ్ముడు రాజు.. జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మర్నాడు నుంచి లావణ్య కూడా కనిపించకుండా పోయింది. దీంతో లావణ్య, నవీన్ లను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య విషయం బయటపడింది. కురుమూర్తి, గణేశ్, బంగారిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్ శివారులో పూడ్చిపెట్టిన బాలస్వామి మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం చేయించారు. హత్యకు సుపారీ గ్యాంగ్ రూ. 2 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది.