అందుకే వారు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించారు
ధర్నా చౌక్ ఎత్తివేసినందుకే నర్సులు తమ డిమాండ్ ల సాధన కోసం ముఖ్యమంత్రిని ఇంటిని ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం. సచివాలయం దగ్గరే ధర్నా చౌక్ ఉండాలి తప్ప ఎక్కడో ఒక మూలకు ఉంటే ప్రజలు నిరసన తెలిపేందుకు ఆస్కారం లేకుండాపోయే ప్రమాదముంది- ప్రొఫెసర్ కోదండరామ్
తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ నర్సులు సిఎం కెసిఆర్ ఇంటిని ముట్టడించడం వెనుక అసలు విషయాన్ని టిజెఎసి చైర్మన్ కోదండరాం వెల్లడించారు.
ధర్నా చౌక్ ఎత్తివేసినందుకే నర్సులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఎం ఇంటిని ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. సచివాలయం దగ్గరే ధర్నా చౌక్ ఉండాలి తప్ప... ఎక్కడో ఒక మూలకు ఉంటే.. ప్రజలు నిరసన తెలిపేందుకు ఆస్కారం లేకుండాపోయే ప్రమాదముందన్నారు.
ఆరో తేదీన నర్సులు తమ డిమాండ్ల మీద ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉదయమే 5;30గంటలకు నుండే బైటాయించారు. తమ ఉద్యోగాలను
రేగులైజషన్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానములో జాబ్స్ భర్తీ చేయకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు (వీడియో).
ఈ రోజు వనపర్తి జిల్లాల్లో ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పాలన చేయకుండా అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని విమర్శించారు. శాంతియుత పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేసుకునే హక్కును కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి తీరా ధర్నా చౌక్ ఎత్తివేయడం దానికి విరుద్దమే కదా అని ఆయన ప్రశ్నించారు. మేనిఫెస్టోకు విరుద్ధంగా పాలన సాగడం సమంజసమేనా అని ఆయన నిలదీశారు. వనపర్తి పట్టణంలో సెక్షన్ 30 ని వెంటనే ఎత్తివేయాలని, ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలన్నారు.
వర్షాకాలం ఆరంభమైనందున రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేవలం 40శాతం మంది రైతులకు మాత్రమే బ్యాంకుల ద్వారా రుణాలు అందుతున్నాయని, మిగతా రైతులకు అందడంలేదన్నారు. అందుకే వారు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తెచ్చుకుని అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయని.. తక్షణమే సర్కారు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు.