Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి పై కేసిఆర్ మాటలు పచ్చి అబద్ధాలే

  • మూడున్నరేళ్లలో కేసిఆర్ చేసిందేం లేదు
  • సింగరేణికి వెళ్లే మొహం లేక హైదరాబాద్ లో మాట్లాడుతున్నడు
  • సింగరేి కార్మికులు కేసిఆర్ మాటలు నమ్మొద్దు
  • కార్మిక సంఘాలు సంతకాలు చేసినట్లు ఆధారాలు చూపండి
what kcr promised for singareni workers is all falsehood

కేసిఆర్ సింగరేణి కార్మికుల కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని అఖిలపక్ష నేతలు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిపిఐ నేత చాడా వెంటకరెడ్డి మాట్లాడుతూ సింగరేణి పై కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు. కార్మికులకు లాభాలలో వాటా పెంచిందేమీ లేదన్నారు. మూడేళ్లలో రూ. 1400 కోట్ల లాభం వస్తే రూ. 395 కోట్లు మాత్రమే లాభంగా చూపిస్తున్నారని ఆరోపించారు. సీఎస్ఆర్ ఫండ్ వెయ్యి కోట్లు కవిత నియోజకవర్గం, మెదక్ లో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఆ సొమ్మేదో తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక 11 వేల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని గుర్తు చేశారు. మూడున్నరేళ్లలో వారసత్వ ఉద్యోగాల పై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవన్నావు? మరి సింగరేణిలో ఇప్పటికీ 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. బోనస్ ఇవ్వడంలో కేసీఆర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. 2012 లో సెంటిమెంట్ తో గెలిచారు. ఈసారి గిలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారసత్వ ఉద్యోగాలు వద్దని మేం ఏ ఒక్క చోటైనా సంతకం పెట్టినట్టు చూపించగలరా?  అని సవాల్ చేశారు.                      

టి పిసిస చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం ఈ స్థాయిలో అబద్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. సింగరేణి కార్మికులకు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీశారు. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే వారసత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ ఉద్యోగాల పై కేసు వేసింది జాగృతి కార్యకర్త అనే విషయం మరచిపోరాదన్నారు. కోర్టు కేసులకు, కాంగ్రెస్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇవి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవ ఎన్నికలు కాబట్టి కార్మికులను అవినీతి సొమ్ముతో కొనలేరని హెచ్చరించారు. కార్మికులకు ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తానని మాట తప్పారన్నారు. కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానని ఇప్పటికీ తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సింగరేణి షేర్లు కొంటానన్నవారు మూడున్నరేళ్లలో ఎందుకు కొనలేదని నిలదీశారు. మూడున్నరేళ్లలలో కేసీఆర్ మొదలు పెట్టి, పూర్తి చేసిన పవర్ ప్లాంట్ ఒక్కటీ లేదని విమర్శించారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే నోట్ల బస్తాలు తీసుకువెళ్లి సింగరేణి ఏరియాలో పంచుతున్నారని ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాటల మత్తులో ముంచేవాడు, నమ్మినవాళ్లను ముంచే వాడు కేసీఆర్ అని చమత్కరించారు. సింగరేణికి వెళ్లడానికి కేసీఆర్ కు మొహం చెల్లలేదన్నారు. ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. అందుకే హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. వారసత్వ ఉద్యోగం, కారుణ్య నియామకం విషయంలో తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కారుణ్య నియామకం పేరుతో వారసత్వ ఉద్యోగం ఇస్తే అవి చట్ట ప్రకారం చెల్లవు కదా అన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియను గందరగోళ పరిచేలా సీఎం మాట్లాడుతున్నారని, ఓట్ల కోసమే నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ వారసత్వ ఉద్యోగాల పై కేసు వేశారని ఆయన స్వయంగా కవిత ఆధ్వర్యంలోని జాగృతి కార్యకర్త అని గుర్తు చేశారు. కేసు వాదించిన సత్యంరెడ్డి టీఆర్ఎస్ న్యాయ విభాగంలో నాయకుడు కాదా అని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితుల పై కేసు వేసిన చింపుల సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడే అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios