వీకేండ్ లాక్డౌన్పై నిర్ణయం తీసుకోవాలి, నైట్ కర్ఫ్యూ టైమ్ పెంచాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశం
కరోనా కేసులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్: నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకొన్నారని ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా కేసులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు.
also read:తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు: మే 8వరకు రాత్రి కర్ఫ్యూ
కరోనా టెస్టుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదని హైకోర్టు ప్రశ్నించంది. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.రోజూ కనీసం లక్ష టెస్టులు చేయాలని హైకోర్టు సూచించింది. కనీసం వీకేండ్ లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని కూడ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ నెల 8వ తేదీలోపుగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.
నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు పెట్టాలని హైకోర్టు సూచించింది. మాస్కులు దరించకపోతే వాహనాలను సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్సకి ప్రభుత్వమే ధరలను నిర్ణయించాల్సిందిగా కోరింది. సిటీ స్కాన్, ఆక్సిజన్, బెడ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలపై జీవో జారీ చేయాలని సూచించింది. గత ఏడాది ఇచ్చిన జీవో ఇప్పటి అవసరాలకు పనికిరాదని హైకోర్టు అభిప్రాయపడింది.ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ వివరాలను వెబ్సైట్ లో పెట్టాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలను 24 గంటల్లో ఇవ్వాలని కోరింది.
గత మాసంలో కరోనా కేసులపై విచారణ నిర్వహించిన సమయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలోనే నైట్ కర్ఫ్యూ లేదా వీకేండ్ లాక్డౌన్ అమలు చేయాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. నైట్ కర్ప్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 8వ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.