తెలంగాణ ఇస్తే ఆత్మాహుతి దాడులు చేస్తామన్న కేశవ్ పయ్యావుల కసబ్ గా అభివర్ణించిన తెలంగాణవాదులు నేడు కేసిఆర్, కేశవ్ భేటీతో చల్లబడ్డ వాతావరణం ఆంధ్రా రాజకీయాలపై, నంద్యాల ఎన్నికలపై కేసిఆర్ ఆరా
వీరిద్దరూ తెలుగు రాజకీయాల్లో ప్రత్యర్థులే. తెలంగాణ రాకముందు ఒకరిపై ఒకరు గట్టిగానే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు కావడంతో వీరిలో ఎవరిని ఎవరు విమర్శించాల్సిన పనిలేకుండా పోయింది. విభజన జరిగి మూడేళ్లవుతోంది. పాత వైరం మాని స్నేహం పంచుతున్నారు. వారెవరో కాదు తెలంగాణ సిఎం కేసిఆర్, అనంతపురం జల్లా టిడిపి నేత పయ్యావుల కేశవ్.

ఆదివారం అనంతపురం జిల్లాలో జరిగిన పరిటాల శ్రీరాం వివాహ వేడుకకు తెలంగాణ సిఎం కేసిఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన తిరుగు పయణం అవుతున్న సందర్భంగా హెలిప్యాడ్ వద్ద తెలంగాణ సిఎం కేసిఆర్ పయ్యావుల కేశవ్ ఇద్దరూ కొంతసేపు ఏకాంతంగా మాట్లాడుతుకున్నారు. హెలిప్యాడ్ వద్ద హెలిక్యాప్టర్ ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్లి వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్యావుల కేశవ్ తో కేసిఆర్ ఏం మాట్లాడారబ్బా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పయ్యావులతో కేసిఆర్ తాజా ఆంధ్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా నంద్యాల ఎన్నికలు, ఫలితాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. నంద్యాలలో టిడిపి మంచి మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో అంతటి మెజార్టీ ఎలా సాధ్యమైందని కేసిఆర్ ఆరా తీసినట్లు చెబుతున్నారు.
మొత్తానికి వీరిద్దరి ఏకాంత చర్చలు రెండు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాకముందు పయ్యావుల కేశవ్ పట్ల తెలంగాణ ప్రజలు భగ్గుమనే వాతావరణం ఉంది. తెలంగాణ ఇస్తే ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ సంచనల కామెంట్లు చేశారు ఆ రోజుల్లో పయ్యావుల కేశవ్. దానిపై తెలంగాణ అంతటా అట్టుడికిపోయింది. పయ్యావుల కేశవ్ బొమ్మలను తగలబెట్టారు తెలంగాణవాదులు. మరోవైపు పయ్యావుల కేశవ్ ను పేరు మార్చి పయ్యావుల కసబ్ అని తెలంగాణవాదులు కోపంతో పిలిచేవారు. (ఆరోజుల్లో కసబ్ ఉరి ప్రాధాన్యతాఅంశం కావడంతో పయ్యావులకు ఆ పేరు పెట్టారు) ఇలాంటి తెలంగాణ వ్యతిరేక భావజాలం ఉన్న కేశవ్ తో కేసిఆర్ ఏకాంతంగా ముచ్చటించడం తెలంగాణవాదుల్లో కొత్త రకం చర్చకు దారితీసిందని చెబుతున్నారు.
