ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు పాటిబండ్ల చంద్రశేఖర్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు

ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు పాటిబండ్ల చంద్రశేఖర్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

1936 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా వీరులపాడులో జన్మించిన పాటిబండ్ల మద్రాస్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశారు. హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్‌డీ పట్టా పొందారు. అనంతరం దేశ, విదేశాల్లో పలు హోదాల్లో పనిచేశారు.

1963 నుంచి 67 వరకు ఇండియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకుడిగా పనిచేశారు. 1994 నుంచి 2000 వరకు ఈ సంస్థకు చంద్రశేఖరరావు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1967లో విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు. భారత్ తరపున 18 ఏళ్ల పాటు సముద్ర న్యాయవివాదాల ట్రైబ్యునల్‌లో సేవలందించిన ఏకైక వ్యక్తిగా పాటిబండ్ల రికార్డులకెక్కారు.

1972 నుంచి 1976 వరకు ఐక్యరాజ్యసమితో భారత శాశ్వత విభాగంలో న్యాయ సలహాదారుడిగా పనిచేశారు. అలాగే కేంద్ర న్యాయశాఖలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. 1996 నుంచి సముద్ర చట్టాల ట్రైబ్యునల్‌లో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2012లో పద్మభూషణ్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది.

పాటిబండ్ల చంద్రశేఖరరావు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.