ప్రజలు మావైపే, విజయం మాదే: కేసీఆర్
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. ప్రజా కూటమికి పరాజయం తప్పదన్నారు. ఎన్నికలకు ముందే కూటమి విచ్ఛిన్నమైందన్నారు.
గురువారం ఉదయం నుండి రాత్రి వరకు బరిలో ఉన్న 116 టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, సర్వే ఫలితాలను కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులకు వివరించారు.
ప్రజలు తెరాస వైపే ఉన్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.. ఆయా నియోజకవర్గాల్లో సభలు, ప్రజల స్పందన తదితర విషయాలపై కేసీఆర్ చర్చించారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటి పరిణామాలు కూడ టీఆర్ఎస్ పట్ల ప్రజలకు సానుకూల వాతావరణం నెలకొందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఓటమికి భయపడి వారి నియోజకవర్గాలను దాటి బయటికి రాలేదన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక కుట్రపూరితంగా ఆంధ్రా సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని టీఆర్ఎస్ చీఫ్ ఆరోపించారు.
ప్రగతిపథంలో సాగుతున్న తెలంగాణకు ఎన్నికల ఫలితాలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. పోలింగు రోజున అభ్యర్థులంతా కష్టపడాలి. పార్టీ శ్రేణులు, నేతలను కలుపుకొని వెళ్లాలి. ఉదయం నుంచి సాయంత్రం పోలింగు ముగిసే వరకూ ప్రజల్లో ఉండాలని కేసీఆర్ సూచించారు.