వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 101 నుంచి 106 సీట్లు వస్తాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

2019 ఎన్నికలకు అప్పడే ‘కారు’ రెడీ అవుతోంది. తమ పాలన ఇలాగే కొనసాగితే మరోసారి పీఠం మనదేనని కేసీఆర్ తన శ్రేణులకు ధీమాగా చెబుతున్నారు.

ఇంకా ఎన్నికలకు రెండున్నరేళ్లుండగా ఇప్పుడే కేసీఆర్ సీట్ల లెక్కలు మాట్లాడుతుండటం ఇప్పడు పార్టీలోని వారికి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ రోజు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ 2019 ఎన్నికల గురించి ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 101 నుంచి 106 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే, పార్టీ పటిష్టతపై కూడా ఇతర నాయకులకు సూచనలిచ్చారు.

కాంగ్రెస్, టీడీపీతో పోల్చుకుంటే టీఆర్ఎస్ కు సంస్థాగతంగా బలమైన కేడర్ లేకపోవడంతో ఆ వైపు దృష్టి పెట్టాలని సూచించారు.

వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని, వారం, పది రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని పేర్కొన్నారు.

అలాగే జిల్లాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు టార్గెట్‌లు కూడా ఇచ్చారు.

మరో వైపు శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో దానిపై కూడా చర్చించారు.