ముందస్తు ఎన్నికలు... మా పార్టీ వ్యూహం: తేల్చేసిన నాయిని
ముందస్తు ఎన్నికలు మా వ్యూహమని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ప్రజలు కూడ ముందస్తు ఎన్నికలకు ప్రజలు కూడ సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు మా వ్యూహమని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ప్రజలు కూడ ముందస్తు ఎన్నికలకు ప్రజలు కూడ సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేది మా పార్టీ వ్యూహంగా ఆయన కుండ బద్దలు కొట్టారు.
సెప్టెంబర్ రెండో తేదీన కొంగరకలాన్ లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.
ముందస్తు ఎన్నికలకు సంబంధించి అన్ని అధికారాలను కేసీఆర్ కు అప్పగించినట్టు చెప్పారు. ముందస్తు ఎన్నికలకు సీఎం ఏ తేదీ చెప్పినా మేం సిద్దంగా ఉంటామన్నారు. ప్రజలు కూడ ఎన్నికలకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయం కేసీఆర్ కు తెలుసునని ఆయన చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే దానిపై తమ వ్యూహలు తమకు ఉంటాయని ఆయన చెప్పారు.
ప్రగతి నివేదన సభకు సంబంధించి టీఆర్ఎస్ అకౌంట్ నుండే డబ్బులను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ఎంత డబ్బును ఖర్చు చేశామనే దానిపై తమ పార్టీ చీఫ్ కు, పార్టీ నేతలకు లెక్కలు చెబుతామని ఆయన చెప్పారు.
టీజెఎస్ చీఫ్ కోదండరామ్ తెగిన గాలిపటం లాంటి వాడని ఆయన చెప్పారు. ఎవరో చెప్పిన మాటలు విని కోదండరామ్ మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్లు ఉండి కూడ చూడడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని నాయిని హితవు పలికారు.