పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీఎల్పీ నేత భట్టి
పోడు భూముల సమస్యతో పాటు రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. భావ సారూప్యత గల పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు భట్టి విక్రమార్క.
హైదరాబాద్: పోడు భూముల (podu lands) సమస్యలపై అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీలో (Telangana Assembly session)ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka)తెలిపారు.గురువారం నాడు ఆయన హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో నిరుద్యోగ, విద్యార్ధి సైరన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీలను కూడ కోరామని ఆయన చెప్పారు. పోడు భూములు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై భావసారూప్యత గల పార్టీలతో చర్చించామని భట్టి విక్రమార్క చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇటీవలనే నిర్ణయం తీసుకొంది. అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళన బాట పడుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy)ప్రకటించిన విషయం తెలిసిందే.