హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం: ఈ నెల 6న ఆదేశాలిస్తామన్న తెులంగాణ హైకోర్టు
వినాయక విగ్రహల నిమజ్జనంపై ఈ నెల 6న ఆదేశాలిస్తామన్న తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టు విచారించింది. ప్రజల సెంటిమెంట్ తో పాటు ప్రస్తుత పరిస్థితులను కూడ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఈ నెల 6వ తేదీన ఆదేశాలు జారీ చేస్తామని తెలంగాణ హైకోర్టు స్పస్టం చేసింది.వినాయక , దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని పిటిషనర్ కోరారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలను సూచించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.
ప్రభుత్వం, ఉత్సవ సమితి , పిటిషనర్ నివేదికలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడ హైకోర్టు కోరింది.వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో ప్రజల సెంటిమెంట్ తో పాటు ప్రస్తుత పరిస్థితులను కూడా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని కోరింది. అయితే ఈ విషయమై అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల 6న ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.