సారాంశం

తెలంగాణలో పవర్ ప్లేయర్  పార్టీగా తమదే కీలక పాత్ర అని ఎంఐఎం భావిస్తుంది. బీఆర్ఎస్ కు  మిత్రపక్షంగా  కొనసాగుతున్న ఎంఐఎం  కొనసాగుతుంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ  శుక్రవారంనాడు ప్రకటించారు.చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా,బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట,జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లలో  పోటీ చేయనున్నట్టుగా అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

పాషాఖాద్రి, ముంతాజ్ ఖాన్ లు ఈ దఫా పోటీకి దూరంగా ఉంటారని  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. వీరిద్దరి సేవలను  పార్టీ కోసం ఉపయోగించుకుంటామన్నారు. 

చాంద్రాయణ గుట్ట నుండి అక్బరుద్దీన్ ఓవైసీ,  మలక్ పేట నుండి బలాలా, కార్వాన్ నుండి కౌసర్ మొహిద్దీన్, నాంపల్లి నుండి మాజిద్ హుస్సేన్, చార్మినార్ నుండి జుల్ఫికర్ అలీ, యాకుత్ పురా నుండి జాఫర్ హుస్సేన్  బరిలోకి దింపుతున్నట్టుగా  అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నుండి  బరిలోకి దింపే  అభ్యర్ధిని త్వరలోనే ప్రకటిస్తామని  ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది.రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతును ప్రకటించింది. తెలంగాణలో  ఎంఐఎం నాలుగో ప్రధాన పార్టీగా ఉంటుందని ఎంఐఎం చీఫ్ ఇటీవల సంగారెడ్డి జిల్లాలో  నిర్వహించిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.  తెలంగాణలో  ఎంఐఎం పవర్ ప్లేయర్ పాత్ర పోషించనుందని  వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం  ఎంఐఎంకు  ఏడు మంది ఎమ్మెల్యేలున్నారు.  పాతబస్తీతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.  

తెలంగాణ ఏర్పాటు తర్వాత  బీఆర్ఎస్ తో ఎంఐఎం  దోస్తీ కొనసాగుతుంది.  దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో  ఎంఐఎం పోటీ చేస్తుంది.  పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకే ఎంఐఎం పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ  అసద్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 

తెలంగాణ ఎన్నికల సమయంలో కూడ  రాహుల్ గాంధీ ఎంఐఎంపై తీవ్రమైన విమర్శలు చేశారు. అదే సమయంలో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై  అసదుద్దీన్ ఓవైసీ కూడ  అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.