మునుగోడులో ఎవరైనా గెలవాలన్నా, ఓడిపోవాలన్నా మాదే కీలకపాత్ర: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మునుగోడులో మద్దతు విషయమై కాంగ్రెస్, టీఆర్ఎస్ లు తమను కోరుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. అయితే ఈ విషయమై పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామన్నారు.
హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవర్నైనా గెలిపించాలన్నా లేదా ఓడించే సత్తా తమకు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీకి మద్దతివ్వాలనే దానిపై సీపీఐ రాష్ట్ర సమితి చర్చిస్తుంది.ఇవాళ, రేపు ఈ సమావేశాలు జరగనున్నాయి. రేపు మధ్యాహ్నాం తర్వాత మునుగోడు అసెంబ్లీ స్థానంలో ఎవరికి మద్దతిచ్చే విషయమై సీపీఐ తన అభిప్రాయాన్ని ప్రకటించనుంది.
సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన నారాయణ శుక్రవారం నాడు తెలుగు న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ లు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు మంచి పట్టుందని నారాయణ చెప్పారు. ఈ నియోకవర్గంలో ఐదు దఫాలు తమ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉందన్నారు. ఎంత మంచి అభ్యర్ధి అయినా కూడా తాము బీజేపీకి మద్దతివ్వబోమని తేల్చి చెప్పిన విషయాన్ని సీపీఐ నారాయణ గుర్తు చేశారు.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మునుగోడు అసెంబ్లీ స్థానంలో తమకు మద్దతివ్వాలని కోరుతున్నాయని నారాయణ చెప్పారు.ఈ విషయమై పార్టీ రాష్ట్ర సమితిలో చర్చ జరుగుతుందని తెలిపారు. ఇవాళ, రేపు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో ఈ విషయమై చర్చిస్తున్నట్టుగా నారాయణ వివరించారు. రేపు మధ్యాహ్నానికి సానుకూలమైన వార్త చెబుతామని నారాయణ ప్రకటించారు. మునుగోడులో ఏ పార్టీకి మద్దతివ్వాలనే దానిపై చర్చించి పార్టీ నేతల అభిప్రాయాల మేరకు నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీపీఐ నేత నారాయణ తెలిపారు.
గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో కొన్ని కారణాలతో తాము టీఆర్ఎస్ కు మద్దతిచ్చినట్టుగా చెప్పారు. ఇందులో ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ బలం నామమాత్రమేననే విషయాన్ని నారాయణ ప్రస్తావించారు. కానీ మునుగోడులో తమకు బలం ఉందన్నారు. తమకు బలం ఉన్న సమయంలో ఏం చేయాలనే దానిపై పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో చర్చిస్తున్నామన్నారు. ఈ స్థానంలో స్వతంత్రంగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఏ పార్టీకి మద్దతిచ్చే విషయమై చర్చిస్తున్నామని నారాయణ వివరించారు.
పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నందున చాడ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసేందుకు సమయం ఇవ్వలేదన్నారు. పార్టీ రాష్ట్ర సమితి సమావేశం పూర్తైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తారని నారాయణ చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు బీజేపీకి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిందన్నారు. ఈ జిల్లా ప్రజలు బీజేపీని ఆదరించరని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:Munugogde bypoll 2022: రేపు మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్రలకు కోమటిరెడ్డి దూరం
ఈ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్ధులే విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్, 2018లో కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.