వామన్రావు దంపతుల హత్యలో ఎంతటివారున్నా వదలం: రామగుండం సీపీ సత్యనారాయణ
లాయర్ దంపతులను హత్య కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని రామగుండం సీపీ వి. సత్యనారాయణ చెప్పారు.
పెద్దపల్లి: లాయర్ దంపతులను హత్య కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని రామగుండం సీపీ వి. సత్యనారాయణ చెప్పారు.
ఈ నెల 17వ తేదీన పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని కల్వచర్లలో నడిరోడ్డుపై దుండగులు హత్య చేశారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కుంట శ్రీనివాస్, చిరంజీవిలను అరెస్ట్ చేసినట్టుగా సీపీ గుర్తు చేశారు. అంతేకాదు హతుల కదలికల సమాచారాన్ని రెక్కీ చేసిన కుమార్ ను కూడ అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు.
నిందితులను విచారణ చేస్తున్న సమయంలో బిట్టు శ్రీనుకు కూడ ఈ హత్యలతో సంబంధం ఉన్న విషయం తేలిందన్నారు. దీంతో బిట్టు శ్రీనును కూడ అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు.
గుంజపడుగు గ్రామంలో దేవాలయ నిర్మాణమే ఈ హత్యకు కారణమని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. అయితే నిందితులకు బిట్టు శ్రీను వాహనాలు, మారణాయుధాలు ఎందుకు సమకూర్చాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
also read:వామన్రావు దంపతుల హత్య: కల్వచర్లలో భద్రత కట్టుదిట్టం
హైద్రాబాద్ నుండి టెక్నికల్ నిపుణులు, ఫోరెన్సిక్ టీమ్స్ దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు.
లాయర్ దంపతుల కేసులో తమపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.