Asianet News TeluguAsianet News Telugu

భూమైతే వచ్చింది: కానీ లంచం కోసం తప్పని భిక్షాటన

వృద్ధ దంపతులు శుక్రవారం భూపాలపల్లిలో బిచ్చమెత్తుతూ వినూత్న నిరసన తెలిపారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డులు వేసుకొని భిక్షాటన సాగించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌  స్పందించి వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని ఆర్డీఓను ఆదేశించారు.

Warangal: Aged couple begs to pay bribe
Author
Bhupalpally, First Published Jan 26, 2019, 11:58 AM IST

భూపాలపల్లి: ఏళ్ల తరబడి పోరాటం తర్వాత భూమి సొంతమైంది గానీ దాన్ని పొందడానికి లంచం ఇవ్వాల్సి వచ్చి వృద్ధ దంపతులు భిక్షాటన చేశారు. పట్టాదారు పుస్తకం ఇవ్వడానికి తహసీల్దార్ లంచం అడుగుతున్నాడని, ఆ లంచం ఇవ్వడానికి తాము బిచ్చమెత్తక తప్పడం లేదని వృద్ధ దంపతులు అంటున్నారు. 

ఆ వృద్ధ దంపతులు శుక్రవారం భూపాలపల్లిలో బిచ్చమెత్తుతూ వినూత్న నిరసన తెలిపారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డులు వేసుకొని భిక్షాటన సాగించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌  స్పందించి వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని ఆర్డీఓను ఆదేశించారు.

భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కి చెందిన మాంతు బసవయ్య, లక్ష్మి దంపతులకు గ్రామ శివారులోని 50 సర్వే నంబర్‌లో 1.19 ఎకరాలు, 601లో ఎకరం, 622/42లో ఎకరం, 622/52/అ లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన నాటి నుంచి పట్టాదారు పాసుపుస్తకాల కోసం వారు భూపాలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ పట్టాదారు పాసుపుస్తకాలు మాత్రం చేతికి రావడం లేదు.

పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి డబ్బులు అడుగుతున్నాడని, తమ దగ్గర లేవని అంటూ ముసలివాళ్లం అయినందున ఆదుకోవాలని కోరుతూ పట్టణ ప్రధాన రహదారిలోని వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. 

బసవయ్య, లక్ష్మి తమకున్న వ్యవసాయ భూమిని ఎప్పుడో అమ్ముకున్నారని భూపాలపల్లి తహసీల్దార్‌ నారాయణస్వామి అన్నారు. ఆ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. గ్రామంలో విచారణ చేపట్టగా 15 ఏళ్లుగా కానుగంటి కొమురయ్యనే భూమిని సాగు చేసుకుంటున్నాడని తేలిందని వివరించారు. దీంతో పాసుబుక్కును ఇవ్వకుండా నిలిపివేశామని తెలిపారు.

 కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు వృద్ధ దంపతుల విషయంపై స్పందించారు. ఆ వృద్ధ దంపతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందివ్వాలని భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు. దాంతో ఆర్డీవో వృద్ధ దంపతులను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. భూరికార్డులను పరిశీలించారు. 

అదే సమయంలో భూమిని కొనుగోలు చేశానని చెబుతున్న కానుగంటి కొమురయ్య కూడా వచ్చాడు. ఈ భూమి నీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బసవయ్య, లక్ష్మిల భూమిని 1981లో తంశెట్టి బానమ్మ కొనుగోలు చేసిందని, ఆమె నుంచి 1989లో తన తండ్రి కానుగంటి మొండయ్య కొనుగోలు చేశాడని, అప్ప టి నుంచి తామే కాస్తులో ఉన్నామని చెప్పాడు.

2004లో ఆర్‌ఓఆర్‌ పట్టా చేయించుకొని పట్టాబుక్కు తీసుకున్నట్లు చెప్పాడు. ఆ భూమి తమదేనని బసవయ్య, లక్ష్మి 2011 నుంచి గొడవ చేస్తుండటంతో కోర్టును ఆశ్రయించానని, కేసు నడుస్తున్న క్రమంలోనే 2015లో పహాణీ నుంచి తన పేరును అకారణంగా తొలగించారని చెప్పాడు. 

దీంతో ఆర్డీఓ సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను బసవయ్య, లక్ష్మీలకు అందజేశారు. నిజంగా భూమి కొనుగోలు చేసి ఉంటే, అన్ని డాక్యుమెంట్స్‌తో తనకు అప్పీల్‌ చేసుకోవాలని కొమురయ్యకు ఆర్డీవో సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios