ఓటుకు నోటు కేసు: వేం నరేందర్ రెడ్డి కంటతడి
రాజకీయాల్లో అణగదొక్కడాలు ఉంటాయని వేధింపులు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతలా ఉంటాయా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తనను, తన కుమారులను వేర్వేరుగా విచారించారని చెప్పారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తన కుమారులను విచారణకు పిలవడం బాధాకరమని కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో ఎలాంటి సంబంధం లేని తన కుమారులను విచారణకు పిలవడం బాధేస్తోందని కంటతడిపెట్టారు.
ఓటుకు నోటు కేసులో మూడున్నరేళ్ల తర్వాత విచారణకు తనను ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇలా వేధింపులకు పాల్పడుతుందో అర్థం కావడం లేదన్నారు. తన కుమారులు రాజకీయ పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ బయటకు రారని తెలిపారు.
ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. అలాంటి వారిని సోమవారం ఉదయం నుంచి రాత్రి 9.30గంటలకు విచారించడం బాధేస్తోందన్నారు. అలాగే మంగళవారం తనతోపాటు తన కుమారులను కూడా విచారించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో అణగదొక్కడాలు ఉంటాయని వేధింపులు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతలా ఉంటాయా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తనను, తన కుమారులను వేర్వేరుగా విచారించారని చెప్పారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలపై ఆరా తీశారని ఆ డబ్బులు ఎలా వచ్చాయో కోర్టులో తేలుతుందన్నారు. తాను ఇప్పటికీ విచారణకు కట్టుబడే ఉన్నానని ఎప్పుడు పిలిచినా హాజరవుతానని తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పానని, అడిగిన డాక్యుమెంట్స్ సమర్పించినట్లు తెలిపారు.
ఈ కేసును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలుస్తోందని చెప్పారు. తనతోపాటు రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారని వారంలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
రేవంత్ రెడ్డికి షాక్: ఓటుకు నోటు కేసులో ఈడీ నోటీసులు
ఓటుకు నోటు కేసు: ఈడీ విచారణకు కాంగ్రెస్ నేతలు